లక్నో: యూపీ గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ(Mukhtar Ansari) మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన తండ్రి ముక్తార్ అన్సారీకి జైలులో విష ప్రయోగం జరిగిందని కుమారుడు ఉమర్ అన్సారీ ఆరోపించారు. ఉమర్ చేసిన ఆరోపణలను జైలు అధికారులు ఖండించారు. తనకు స్లో పాయిజనింగ్ జరుగుతున్నట్లు తన తండ్రి చెప్పాడని ఉమర్ అన్సారీ మీడియాతో పేర్కొన్నాడు.యావత్ దేశానికి ఈ విషయం తెలుసు అని అతను తెలిపాడు. ముక్తార్ అన్సారీ సోదరుడు, ఘాజిపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా ముక్తార్పై విష ప్రయోగం జరిగినట్లు ఆరోపించాడు. శుక్రవారం ముక్తార్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. భద్రతా దళాలను కూడా భారీగా మోహరించారు.
ఉత్తర ప్రదేశ్లోని బాందా వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ ముక్తార్ తుది శ్వాస విడిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కౌశల్ తెలిపారు. బాందా జైలులో ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకూడదని పోలీసులు ఆదేశించారు.
ముక్తార్ అన్సారీపై 60 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఆయనకు శిక్షలు పడటం 2022 సెప్టెంబరు నుంచి ప్రారంభమైంది. ఎనిమిది కేసుల్లో వేర్వేరు కోర్టులు శిక్ష విధించాయి.