న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) లేదా జాతీయు గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నది. ప్రతి ఏడాది లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ పథకానికి గణనీయంగా నిధులు తగ్గించి ఇప్పటికే మోదీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నది. తాజాగా ఆ పథకాన్ని కనుక కాగ్ ఆడిట్ చేస్తే ఎన్నో లోపాలు బయటపడతాయని కేంద్ర ప్రభుత్వం భయపడుతుందా? అన్న ప్రశ్న తలెత్తింది. 2005లో ప్రవేశపెట్టిన ఈ పథకం వయోజన సభ్యులకు ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీని ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే పనుల ద్వారా ఉపాధి కల్పించి ప్రజల జీవన భద్రతను పెంచడం ఈ పథకం లక్ష్యం. అయితే జాతీయ స్థాయిలో అత్యంత ముఖ్యమైన ఈ పథకం అమలు తీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2013 నుంచి ఎలాంటి ఆడిట్ నిర్వహించ లేదు. కాగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ పథకానికి చివరిసారిగా 2013లో ఆడిట్ నిర్వహించారు. ఈ పథకాన్ని 2016లో జాతీయ స్థాయిలో కాగ్ ఆడిట్కు తీసుకుంది. కానీ ఆడిట్ చేయకుండా కేవలం సామాజిక ఆడిట్ యూనిట్లను పరిశీలించడానికి మాత్రమే పరిమితమైంది. 2013లో కాగ్ ఇచ్చిన నివేదిక సమగ్రంగా ఉంది. ఈ పథకానికి సామాజిక ప్రభావాన్ని కవర్ చేసే ప్రణాళిక ఉందని 2016 నివేదికలో పేర్కొన్నది. ఆ తర్వాత ఈ పథకంపై కాగ్ నివేదిక ఊసే లేకుండాపోయింది.
కేంద్రం అదుపులో కాగ్!
కాగ్ అనేది స్వయం ప్రతిపత్తి గల అత్యున్నత ఆడిట్ సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల వ్యయాలను ఆడిట్ చేసే హక్కు దానికి ఉంది. దీని నివేదికలను పార్లమెంట్/శాసనసభల ముందు ఉంచుతారు. అయితే పేరుకి స్వయం ప్రతిపత్తి సంస్థ అయినా దీన్ని కేంద్రం అదుపులో పెట్టుకుంటుందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చి ముగ్గురు కాగ్ అధికారులను మోదీ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడం మనకు తెలిసిందే. మోదీ హయాంలో చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల్లో వందలాది కోట్ల ఆక్రమాలు జరిగాయంటూ కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం గణనీయంగా నిధుల కేటాయింపును తగ్గించింది. 2023 బడ్జెట్లో ఈ పథకానికి రూ.60 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33 శాతం తగ్గుదల. పైగా ఈ పథకం గురించి ఇటీవల కొన్ని రాష్ర్టాల్లో చోటుచేసుకున్న వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకం కింద కూలీలకు చెల్లింపులలో డిజిటల్ విధానం తీసుకురావడమే కాక, పలు ఆక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. అందువల్లే రెగ్యులర్గా ఈ పథకానికి కాగ్ ఆడిట్ నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి.