న్యూఢిల్లీ: ఎండలు దంచికొట్టిన రోజుల్లో కన్నా.. స్వల్ప స్థాయిలో ఎండలు మండే(Heat Waves) రోజుల్లోనే ఎక్కువ శాతం మంది మరణిస్తుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన ఓ స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. జర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ లో ఆ స్టడీని ప్రచురించారు. ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో సంభవించే ఆరోగ్య సమస్యల గురించి మరింత అధ్యయనం చేయాల్సి ఉందని స్వీడెన్లోని కరోలిన్క్కా ఇన్స్టిట్యూట్ రచయిత జీరోయిన్ డీ బాంట్ తెలిపారు.
ఇండియాలో 2008 నుంచి 2019 మధ్య పది నగరాల్లో నమోదు అయిన హీట్వేవ్ మరణాల గురించి ఆ స్టడీలో పబ్లిష్ చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో 95 శాతం కన్నా ఎక్కువ వేడి ఉన్న రోజులను ఎంపిక చేసుకుని ఆ అంశాన్ని పరిశోధకులు స్టడీ చేశారు. విభిన్న ప్రాంతాల్లో హీట్వేవ్ ఎలా ఉంది, ఆ పరిస్థితుల్లో కలిగే ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేశారు.
కనీసం అయిదు రోజుల పాటు స్వల్ప స్థాయిలో ఎండలు కొట్టే రోజుల్లో మరణాలు 33 శాతం అధికంగా ఉన్నట్లు అంచనా వేశారు. అయితే కేవలం ఒక్క రోజు మాత్రమే ఎండ అధికంగా ఉండే రోజుల్లో మరణాల రేటు కేవలం పది శాతం మాత్రమే పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో స్వల్ప స్థాయిలో ఎండలు దంచే రోజుల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు స్టడీలో తేల్చారు.
స్వల్ప స్థాయి ఎండలు ఎక్కువ రోజులు ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. అతిగా ఎండలు దంచికొట్టే రోజులు తక్కువ అని, అవి అప్పుడప్పుడు వస్తుంటాయని, అందుకే ఆ రోజుల్లో మరణాలు సంఖ్య తక్కువే ఉంటుందన్నారు.