Andaman & Nicobar : పవన్ హన్స్ హెలికాప్టర్కు భారీ ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో హెలికాప్టర్లోని ఏడుగురు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో జరిగింది.
పోర్ట్ బ్లెయిర్ (శ్రీ విజయ పురం) నుంచి ఉదయం 8.30-8.45 గంటల మధ్యలో హెలిక్టాపర్ బయలుదేరింది. ఈ హెలికాప్టర్ రోజూ పోర్ట్ బ్లెయిర్-రన్ఘాట్-మాయాబందర్ మధ్య ప్రయాణిస్తుంది. అయితే, ఉదయం హెలికాప్టర్ బయల్దేరిన తర్వాత సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో మాయాబందర్కు దగ్గర్లో హెలికాప్టర్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రదేశం హైవేకు 300 మీటర్ల దూరంలో ఉంది. హెలికాప్టర్ సముద్రంలో ల్యాండ్ అవ్వగానే అక్కడి సహాయక సిబ్బంది వారిని రక్షించారు. ఈ ఘటనలో హెలికాప్టర్లోని ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేవని సంబంధిత అధికారులు తెలిపారు.
ఏడుగురిని ముందు జాగ్రత్తగా స్థానిక ఆస్పత్రికి తరలించి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు గల కారణాల్ని తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే ఝార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్ కూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సేఫ్టీపై అనుమానాలు తలెత్తుతున్నాయి.