ముంబై: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసిన ఘటనకు నిరసనగా మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సోమవారం పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, వ్యాపార సంస్థలను ఆయా సంఘాల పిలుపుతో మూసివేశారు. బస్సులు, ఆటోలు, ట్యాక్సీ సర్వీస్ వంటి ప్రజా రవాణా కూడా ప్రభావితమైంది. ముంబై, పూణే, థాణేలో బంద్ ప్రభావం బాగా కనిపిచింది.
ముంబైలో ఉదయం లోకల్ బస్సులను నడిపేందుకు ప్రయత్నించగా పలు ప్రాంతాల్లో కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనల్లో 9 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో బస్సులను పూర్తిగా నిలిపివేశారు. ఉద్యోగాలకు వెళ్లేవారు చాలా ఇబ్బంది పడ్డారు. ముంబైలో లోకల్ రైళ్లు నడవడంతో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. మెట్రో రైళ్లు కూడా యథావిధిగా నడిచాయి. ముంబైలో ఉదయం నుంచే షాపులు, వ్యాపార సంస్థలను మూసివేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని షాపులను తెరిచారు.
మరోవైపు బంద్ను బీజేపీ వ్యతిరేకించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రతి ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. కాగా, సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పలు చోట్ల రైతులకు మద్దతుగా నిరసనలు నిర్వహించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో శివ సైనికులు ముంబై-బెంగుళూరు హైవేను 15 నిమిషాలపాటు అడ్డుకున్నారు. దీంతో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముంబైకి చెందిన ఒక న్యాయవాది బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాకు ఒక లేఖ రాశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బంద్కు పిలుపునివ్వడంపై సుమోటోగా స్వీకరించి విచారణ జరుపాలని కోరారు.