Assam CM : ఐఐటీ గువాహటి (IIT Guwahati) కి చెందిన 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ (Scholarships) లు అందించాలని అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమాంత బిశ్వశర్మ (Himanta Biswasharma) నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను, ఐఐటీ గువాహటి డైరెక్టర్ను ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ 1న జరిగిన ఐఐటీ గువాహటి 33 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ గువాహటి కేవలం విద్యలో ప్రతిభ చూపించే సంస్థ కాదని.. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ఐఐటీ గువాహటి విద్యార్థుల కోసం అస్సాం ప్రభుత్వం 100 స్కాలర్షిప్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరగా అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను, ఐఐటీ గువాహటి డైరెక్టర్ను కోరారు. అస్సాం ఎదుర్కొనే సంక్లిష్టమైన సాంకేతిక, అభివృద్ధి సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో ఐఐటీ గువాహటి కీలకపాత్ర పోషిస్తుందని హిమంత బిశ్వ శర్మ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగానే ఐఐటీ గువాహటి విద్యార్థులకు సీఎం ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు.
జీవితం పరుగు పందెం కాదని, మీరు అందరికంటే వేగంగా ముందుకు వెళ్లకపోయినా పర్వాలేదని హిమాంత అన్నారు. దానివల్ల మీరు వెనుకబడినట్లు భావించాల్సిన అవసరం లేదని సీఎం హిమంత బిశ్వశర్మ సూచించారు.