అఖిల భారత జ్యుడీషియల్ సర్వీస్ (ఏఐజేఎస్)ను ఏర్పాటుచేసి కింది కోర్టు న్యాయమూర్తుల ఎంపిక చేయాలని కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగాఅనిపిస్తున్నది. గతవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖామంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించి ఈ విషయం గురించి ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నదని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 (1) ప్రకారం ఏఐజేఎస్ను ఏర్పాటుచేయడానికి అవకాశం ఉంది. ఈ సర్వీస్ను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రాజ్యసభలో రిజల్యూషన్ ప్రవేశపెట్టి పాస్ చేయిస్తే సరిపోతుంది. అయితే ఈ ప్రతిపాదనను చాలా రాష్ర్టాలు, రాష్ర్టాల హైకోర్టులు వ్యతిరేకిస్తునాయి.
న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతోనే సమస్య తీరదు. కేసులను పరిష్కరించే దిశగా వారి దృష్టిని మరల్చాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్న మన దేశానికి అఖిల భారత జ్యుడీషియల్ సర్వీస్ (ఏఐజేఎస్) ఏర్పాటు అభిలషణీయం కాదు. ఈ ఏర్పాటు గురించి తీవ్రస్థాయిలో అందరు భాగస్వాములతో చర్చలు జరిగి ఏకాభిప్రాయమో, మెజారిటీ అభిప్రాయమో ఏర్పడిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి జాతీయ సంస్థ హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికకు అవసరం.
మన దేశంలో న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ రెండు రకాలుగా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ వేరు. దిగువ కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ మరో విధంగా ఉంటుంది. దాదాపు ఓ 25 ఏండ్ల కిందటి వరకు మున్సిఫ్ మేజిస్ట్రేట్ల ఎంపికను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసేది. అభ్యర్థులు రాత పరీక్ష రాసి నెగ్గిన తరువాత ఇంటర్వ్యూ ఉండేది. ఓ సీనియర్ హైకోర్టు న్యాయమూర్తితోపాటు సర్వీస్ కమిషన్ సభ్యులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసేవారు. జిల్లా జడ్జీల ఎంపికను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైకోర్టు చేపట్టేది. వాళ్లకు రాత పరీక్ష ఉండేది కాదు. ఇంటర్వ్యూ మాత్రమే ఉండేది. హైకోర్టు న్యాయమూర్తులకు ఇంటర్వ్యూ కూడా లేదు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసేవారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఆ తరువాత కొంతకాలానికి మున్సిఫ్ మేజిస్ట్రేట్ (జూనియర్ సివిల్ జడ్జిల) ఎంపిక ప్రక్రియను, జిల్లా జడ్జిల ఎంపిక ప్రక్రియను హైకోర్టు చేపట్టింది. ఈ రెండు ఉద్యోగాలకు రాత పరీక్షను, ఇంటర్వ్యూను హైకోర్టు నిర్వహించి ఎంపిక చేస్తుంది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది.
ఇప్పుడు కింది కోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం అఖిల భారత జ్యుడీషియల్ సర్వీస్ (ఏఐజేఎస్)ను ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను చాలా రాష్ర్టాలు, హైకోర్టులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యతిరేకతను మానుకోవాలని న్యాయశాఖామంత్రి అందరినీ కోరారు. ఈ సర్వీస్ ప్రతిపాదనను రాష్ర్టాలు, రాష్ర్టాల హైకోర్టులు వ్యతిరేకించడానికి కారణమున్నది. అవి సహేతుకంగానే వ్యతిరేకత తెలుపుతున్నాయి. హైకోర్టులలో విచారణ అంటే ట్రయల్ జరగదు. జిల్లా కోర్టుల్లో ఇంకా కింది కోర్టుల్లో కేసుల విచారణ అంటే సాక్షులను విచారించడం, ముద్దాయిలను ప్రశ్నించడం లాంటివి జరుగుతాయి.
చాలా రాష్ర్టాల్లో కింది కోర్టుల్లో న్యాయపాలన వారి మాతృభాషలోనే కొనసాగుతున్నది. మన రాష్ట్రంలో తీర్పులను తెలుగులో ప్రకటించే వీలున్నప్పటికీ న్యాయమూర్తులు ఇంగ్లీషులోనే ఇస్తున్నారు. నేను తెలుగులో తీర్పులు ప్రకటించినప్పుడు, దాన్ని ప్రేరణగా తీసుకొని కొంతమంది న్యాయమూర్తులు తెలుగులో తీర్పులను ప్రకటించారు. ఆ తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అన్పించడం లేదు. సాక్షులు తమ భాషలో యాసలో సాక్ష్యాలు చెప్తారు. వాటిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి నమోదు చేస్తున్నారు. తెలుగు వచ్చిన న్యాయమూర్తులకే కొన్ని ప్రాంతాల భాష యాస ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్, ఐపీఎస్ల మాదిరిగా వివిధ రాష్ర్టాల నుంచి ఎంపిక చేసి వారి మాతృభాష కాని రాష్ట్రంలో నియమిస్తే ఇంకా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం పట్ల చాలామందికి అసంతృప్తిగా ఉంది. వేరే రాష్ర్టానికి చెందిన వ్యక్తి ఆ రాష్ట్రంలో ఉన్న భాషను నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. కేసుల పరిష్కారం మరింత జాప్యమవుతుంది. సత్వర న్యాయానికి విఘాతం కలుగుతుంది. ఇలాంటి అనేక కారణాలతో చాలా రాష్ర్టాలు, హైకోర్టులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.
కోర్టుల్లో కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. మరీ ముఖ్యంగా కింది కోర్టుల్లో మరీ ఎక్కువగా ఉంది. నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ప్రకారం మన దేశంలోని దిగువ కోర్టుల్లో విచారణకు ఉన్న కేసుల సంఖ్య 3.81 కోట్లు. అందులో లక్ష కేసులు ముప్ఫై సంవత్సరాల కాలం దాటినవి. మన దేశంలోని దిగువ కోర్టుల్లో గత నెలలో 14.80 లక్షల కేసులు దాఖలయ్యాయి. కోర్టులు 10.77 లక్షల కేసులను మాత్రమే పరిష్కరించినాయి. కొవిడ్-19 మహమ్మారితో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది. కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగిపోతూనే ఉన్నది. ఈ సంఖ్య వచ్చే ముప్ఫై ఏండ్లలో 15 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ఇన్ని కేసుల పరిష్కారానికి మరెన్నో కోర్టుల అవసరం ఏర్పడుతుంది.
లా కమిషన్ 1987లో సమర్పించిన నివేదిక ప్రకారం ఒక మిలియన్ జనాభాకు యాభై మంది న్యాయమూర్తుల అవసరం ఉంది. ఇప్పుడు మిలియన్ జనాభాకు 20 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతోనే ఈ సమస్య తీరదు. కేసులను పరిష్కరించే దిశగా వారి దృష్టిని మరల్చాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్న మన దేశానికి ఏఐజేఎస్ ఏర్పాటు అభిలషణీయం కాదు. ఈ ఏర్పాటు గురించి తీవ్రస్థాయిలో అందరు భాగస్వాములతో చర్చలు జరిగి ఏకాభిప్రాయమో, మెజారిటీ అభిప్రాయమో ఏర్పడిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి జాతీయ సంస్థ హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికకు అవసరం. ఎందుకంటే అక్కడ భాష అనేది ఆటంకంగా మారదు. అన్ని హైకోర్టుల్లో పాలనాభాష ఇంగ్లీష్. వేరే రాష్ర్టాలకు చెందిన న్యాయమూర్తులు ఉండటం వల్ల సమతుల్యత కూడా ఏర్పడుతుంది. న్యాయమూర్తుల బంధువులు న్యాయమూర్తులు అవుతారన్న అపవాదు కూడా తగ్గుతుంది. అది అవసరం కూడా. కానీ ఇలా ఎవరు ఆలోచిస్తారు?
(వ్యాసకర్త: గతంలో జిల్లా జడ్జిగా, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు)
మంగారి రాజేందర్