తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavita) తెలిపారు. కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్(Madya Pradesh) లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మధ్య ప్రదేశ్ లోని దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘ పీడిత్ అధికార్ యాత్ర’ (Pidit Adhikar Yatra) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ మాదిరి పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పారు. తెలంగాణను సీఎం కేసీఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి మధ్య ప్రదేశ్లో ఉందని ఈ దుస్థితి మారాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ హయాంలో ఎందుకు చేయలేకపోయారు..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కవిత దుయ్యబట్టారు. దేశంలో ఓబీసీ(OBC) న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారని, అది ఎవరి తప్పు? అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు పెంచలేక పోయిందని ఆరోపించారు.
దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని, బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితిని పారద్రోలారని గుర్తు చేశారు.
కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల ఉద్యమం: దామోదర్ యాదవ్
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కులు సాధించడానికి ఉద్యమాన్ని మొదలుపెట్టాలని ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలియజేశారు. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి కేసీఆర్ ఉదాహరణ అని చెప్పారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు జరిగినా సాధించని ఫలితాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్పకాలంలోనే సాధించారని అన్నారు.