బెంగళూరు: దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని (Separate Country For South) కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (Congress MP DK Suresh) గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, బెంగళూరు రూరల్ కాంగ్రెస్ ఎంపీ అయిన డీకే సురేష్ ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దక్షిణాదిపై వివక్షను కేంద్రం కొనసాగిస్తే, తగిన నిధులు ఇవ్వకపోతే దక్షిణాది రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తామని అన్నారు. ‘గ్రాంట్ల వివక్షను సరిచేయకపోతే ప్రత్యేక దేశం ఇవ్వండి. గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యం. కేంద్ర నిధుల్లో మన వాటా మనకు అందడం లేదు. మన డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తోంది. హిందీ వాళ్లు మనపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయం జరుగుతోంది’ అని అన్నారు.
కాగా, కేంద్ర బడ్జెట్పైనా డీకే సురేష్ స్పందించారు. ఇది ఎన్నికల బడ్జెట్ అని, కొత్తేమీ లేదని విమర్శించారు. మధ్యంతర బడ్జెట్లో పేర్లు మాత్రమే మార్చారని, కొన్ని పథకాలకు సంస్కృతం పేర్లు పెట్టారని ఆయన ఆరోపించారు.
Now DK Suresh, Congress MP and bother of DyCM of Karnataka, demands separate country for south claiming that taxes collected from Southern states are going to Northern stateshttps://t.co/Ao6IIO1GMe pic.twitter.com/t5dVdvLtIA
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 1, 2024