రాంచి: బీజేపీయేతర పార్టీల నాయకులే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న బీజేపీ సర్కారు తీరుపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ దాదాపు 9 గంటలపాటు తనను విచారించిన మరుసటి రోజే సోరెన్ బీజేపీపై భగ్గుమనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జన్ ఆక్రోశ్ ర్యాలీ పేరిట హేమంత్ సోరెన్ ఇవాళ జార్ఖండ్ రాజధాని రాంచిలో బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని బీజేపీ ప్రభుత్వాలకు ఎలాంటి మచ్చలు లేవా..? కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకుంటున్నాయి..? ఇది కేవలం రాజకీయ కుట్ర. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవాన్ బిర్సాముండా ఏనాడూ బ్రిటిషర్స్కు తలవంచలేదు. బీజేపీ కుట్రలు ఇక్కడ పనిచేయవు అని వ్యాఖ్యానించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో తమకు వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ బీజేపీయేతర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే దర్యాప్తు సంస్థల చర్యలు దేనికి..? తెలంగాణ, కేరళ, బెంగాల్, బీహార్ ఇలా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా పనిచేస్తాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చర్యలుండవు..? అంటే బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి మచ్చలు లేకుండా శుద్ధంగా ఉన్నాయా..? అని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు.