న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్ బుధవారం స్వాగతించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు ‘ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు, దౌత్యం’ అవసరమని పిలుపునిచ్చింది. కాల్పుల విరమణ సమయంలో హొర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలుగవని తాము భావిస్తున్నట్టు తెలిపింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ ఇరు దేశాలకు చెప్తూనే ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు, సీఎన్జీ వంటి ఉత్పత్తుల రవాణాకు ఆటంకం ఏర్పడటంతో భారత్ సహా చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.