బెంగళూరు, అక్టోబర్ 3: అంగారకుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మంగళ్యాన్ ప్రస్థానం ముగిసింది. గ్రౌండ్ స్టేషన్తో మార్స్ ఆర్బిటార్కు సంబంధాలు తెగిపోయాయని ఇస్రో సోమవారం అధికారికంగా ధ్రువీకరించింది. మంగళ్యాన్ మిషన్ ముగిసినట్టేనని ప్రకటించింది. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ను ఇస్రో 2013 నవంబర్ 5న ప్రయోగించింది. ఆరు నెలలు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే అంచనాలకు మించి ఎనిమిదేండ్ల పాటు అప్రతిహతంగా ఇది సేవలు అందించింది. అంగారకుడికి సంబంధించిన వేల ఫొటోలు పంపింది. ఇటీవలి సుదీర్ఘ గ్రహణాల కారణంగా ఇంధనం అయిపోవడం, బ్యాటరీ స్థాయి పడిపోవడంపై గతనెల 27న జరిగిన సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు చర్చించారు.