అహ్మదాబాద్: విదేశీ రవాణా నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన ఎంటీ గ్లోబల్ కింగ్ I, యూఏఈలోని ఖోర్ ఫక్కన్ నుంచి కర్ణాటకలోని కార్వార్కు 6,000 టన్నుల బిటుమెన్ను రవాణా చేస్తున్నది. అయితే గుజరాత్లోని పోర్బందర్ తీరానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఈ రవాణా నౌక అనియంత్రిత వరదల కారణంగా ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ఎంటీ గ్లోబల్ కింగ్ నుంచి ప్రమాద హెచ్చరికను భారత్ కోస్ట్ గార్డ్ అందుకుంది.
కాగా, ప్రమాద హెచ్చరిక అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. కోస్ట్ గార్డ్లో ఇటీవల ప్రవేశపెట్టిన ద్రువ్ హెలీకాప్టర్ ద్వారా ఎంటీ గ్లోబల్ కింగ్ వద్దకు చేరుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఓడ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అందులో ఉన్న 22 మంది సిబ్బందిని రక్షించి హెలీకాప్టర్ ద్వారా పోర్బందర్కు చేర్చారు. కోస్ట్ గార్డ్ అధికారులు ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. రెస్క్యూకు సంబంధించిన ఒక వీడియోను కూడా ట్వీట్ చేశారు.
#WATCH | Indian Coast Guard is carrying out rescue operations in Arabian Sea near Porbandar coast in Gujarat after a distress alert was received from MT Global King due to uncontrolled flooding onboard: ICG officials (1/2) pic.twitter.com/5vHKZgzrSc
— ANI (@ANI) July 6, 2022