న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశీ పేరుతో విదేశీ టెక్నాలజీని చౌర్యం చేసిన గల్గోటియాస్ యూనివర్సిటీ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో సదస్సు నుంచి ఈ యూనివర్సిటీని గెంటివేశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఈ వర్సిటీ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో ఓ స్టాల్ ఏర్పాటుచేసింది. యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రోబోడాగ్ను అభివృద్ధి చేశామంటూ దాన్ని విద్యాసంస్థ ప్రతినిధులు ప్రదర్శించారు. దానికి ఓరియోన్ అని పేరుపెట్టి దాని పనితీరును మీడియాకు వివరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అలాంటి రోబోడాగ్నే చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. యూనిట్రీ జీ-2 పేరిట దాన్ని విక్రయిస్తున్నది. దాని ఖరీదు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంది. ఆ రోబోడాగ్ను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
విదేశీ సాంకేతికతను స్వదేశీ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సదస్సు నుంచి గల్గోటియాస్ను బుధవారం గెంటేసింది. దానికి కేటాయించిన స్టాల్ను అధికారులు ఖాళీ చేయించారు. ఈ వివాదం నేపథ్యంలోనే దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన సాకర్ డ్రోన్ను తమ యూనివర్సిటీలోనే అభివృద్ధి చేశామంటూ గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నది. సాకర్ డ్రోన్ను పూర్తిగా తమ క్యాంపస్లోనే అభివృద్ధి చేసినట్లు ఆమె ఆ వీడియోలో వివరించారు. భారత్లో మొట్టమొదటి డ్రోన్ సాకర్ అరేనాను తమ క్యాంపస్లోనే అభివృద్ధి చేసినట్లు ఆమె వెల్లడించారు. దీనికి సిమ్యులేషన్ ల్యాబ్, అప్లికేషన్ అరీనా ఉన్నాయని, తమ క్యాంపస్లోనే దీని ఉత్పత్తిని మరింత మెరుగైన లక్షణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రిమోట్ కంట్రోల్తో పనిచేసే సాకర్ డ్రోన్ చుట్టూ గుండ్రటి ఆకృతి పంజరం మాదిరిగా ఉంటుంది. అయితే ఇది దక్షిణ కొరియాకు చెందిన హెల్సెల్ గ్పూ అభివృద్ధి చేసిన సాకర్ డ్రోన్ను పోలి ఉన్నట్లు నెటిజన్లు విమర్శించడం గమనార్హం. స్కైబాల్డ్రోన్.కాంలో స్ట్రైకర్ వీ3 ఏఆర్ఎఫ్ ప్రొఫెషనల్ డ్రోన్ సాకర్ సెట్ అందుబాటులో ఉంది. ఇది సుమా రు 453 డాలర్లు(రూ. 40,800) ఖరీదు చేస్తుంది. దీన్ని డ్రోన్ సాకర్ అనే ఆటలో ఉపయోగిస్తారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండోర్ టీమ్ గేమ్.
కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశ ప్రతిభ, డాటాను ఉపయోగించుకోవడానికి బదులుగా ఏఐ సమ్మిట్ ఒక అస్తవ్యస్తమైన ప్రచార వేదికగా మారిందని రాహుల్ విమర్శించారు. అమ్మకానికి భారతీయ డాటా, ప్రదర్శనకు చైనీస్ ఉత్పత్తులుగా సమ్మిట్ నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రచారం చేసుకుంటున్నారంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. శివసేన(యూబీటీ) రాజ్యసభ ఉప నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా గల్గోటియాస్ యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీ రోబోను తమ సొంత సృష్టిగా చెప్పుకోవడం సిగ్గుచేటని, దీనిపై చైనీస్ మీడియా నవ్వుకుంటున్నదని ఆమె విమర్శించారు. ఈ విషయంలో నిజంగా సిగ్గుపడాల్సింది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డీడీ న్యూస్ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. ఇండియా ఏఐ సమ్మిట్ని పూర్తిగా ప్రసారం చేసిన ఘనత డీడీ న్యూస్కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. డీడీ న్యూస్, బీజేపీ దొందూ దొందేనని, బీజేపీకి అది ప్రచార సాధనంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు.