తనకు అండగా నిలిచిన ఆ కుటుంబం కోసం ఓ హర్యానా యువతి తపిస్తున్నది. కుటుంబ పెద్దలు దేశ రక్షణకు వెళ్లగా.. ఇంటి పట్టున వదిలేసిన చిన్నారులను వదిలి.. మాతృదేశానికి రాలేనంటున్నదా యువతి. ఉక్రెయిన్లో పరిస్థితి భీకరంగా ఉన్నా.. తనను నమ్మి చిన్నారులను వదిలివెళ్లిన కుటుంబానికి అన్యాయం చేయలేనంటున్నది ఆ ఎంబీబీఎస్ విద్యార్థిని. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య.. మానవత్వం, కరుణ, సోదరభావానికి మన భారతీయ యువతి సోదాహరణగా నిలిచింది.
ఉక్రెయిన్పై శతఘ్నులతో రష్యా దాడులకు పాల్పడుతుండటంతో వివిధ దేశాలు తమ పౌరులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్కు క్షేమంగా చేరుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న నేహా భారత్కు రావడానికి నిరాకరించింది. హర్యానాకు చెందిన నేహా.. ఉక్రెయిన్లోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నది. ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఒక వైద్య కళాశాలలో గత ఏడాది చేరింది.
ఓ ఇంట్లో పెయింగ్ గెస్ట్గా ఉంటున్న నేహా.. కావాలంటే ఇండియాకు తిరిగి వచ్చేది. కానీ, ఆ ఇంటి యజమాని దేశ రక్షణ కోసం ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. దాంతో భారత్ తిరిగి రాకుండా.. అదే ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడంలో ఆయన భార్యకు సాయం చేయాలని నిర్ణయించుకున్నది. కీవ్ మెడికల్ కాలేజీ హాస్టల్లో వసతి దొరక్కపోవడంతో.. కీవ్లోని ఓ కన్స్ట్రక్షన్ ఇంజినీర్ ఇంట్లో నేహా పెయింగ్ గెస్ట్గా ఉంటున్నది. హర్యానాకు చెందిన ఈ 17 ఏండ్ల విద్యార్థిని.. సదరు ఇంజినీర్ భార్య, ఆయన ముగ్గురు పిల్లలతో కలిసి బంకర్లో ఉన్నట్లుగా తెలుస్తున్నది.
తాను ఉంటున్న ఇంట్లో వారి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన నేహాకు.. దేశభక్తి కూడా ఎక్కువే. ఈమె తండ్రి కూడా కొన్నేండ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో పనిచేసి దేశ సేవలో ప్రాణాలు వదిలారు. తల్లి హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో టీచర్గా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. తన కూతురిని ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు నేహా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో తన ఇంటి యజమాని భార్య, ఆమె ముగ్గురు పిల్లలకు అండగా నిలవాలని నిర్ణయించుకోవడంతో రొమేనియాకు వెళ్లేందుకు అవకాశం వచ్చినా నేహా వదులుకున్నది.
‘నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ.. ఈ పిల్లలను, వాళ్ల అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలిపెట్టను’ అని తన తల్లితో ఆఖరు మాటగా చెప్పింది. నేహా తల్లి సన్నిహితురాలు సవితా జాఖర్తో కూడా మాట్లాడింది. హర్యానాలోని ఝజ్జర్ జిల్లా ఝాన్స్వా గ్రామానికి చెందిన సవితా జాఖర్ అనే ఉపాధ్యాయురాలు.. ప్రస్తుతం డెన్మార్క్లోని కోపెన్హాగన్లో నివసిస్తున్నారు. నేహా చేస్తున్న సాయాన్ని సవితా జాఖర్ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.