ముంబై: రేమండ్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ సింఘానియా విడాకుల వ్యవహారం రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నది. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా గౌతమ్ సింఘానియా వ్యక్తిత్వం గురించి నవాజ్ సింఘానియా మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ ఆడియో క్లిప్లో నవాజ్ ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే.. ‘నేను తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే తిరుమల వస్తానని గౌతమ్ సింఘానియా తిరుమల శ్రీవారికి మొక్కుకున్నాడు. అనుకున్నట్లే మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత మొక్కు తీర్చుకోవడం కోసం ఓ రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లాం. అక్కడ తన భర్త సైకోలా వ్యవహరించాడు. గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వకుండా తిరుపతి మెట్లు ఎక్కించాడు’ అంటూ నవాజ్ మోదీ తన భర్త గౌతమ్ సింఘానియా గురించి ఆరోపణలు చేశారు.
‘తిరుమల కొండపైకి వెళ్తున్న సమయంలో ఎన్ని మెట్లు ఉంటాయో తెలీదు. కానీ తిండి, నీళ్లు తాగకుండా మెట్లెక్కాను. దాదాపు రెండు మూడు సార్లు స్పృహతప్పి పడిపోయాను. స్పృహ కోల్పోయినా పైకి లేపి మరీ నడిపించాడు. అలా శ్రీవారిని దర్శించుకున్నాం’ అని నవాజ్ చెప్పారు. సింఘానియా దైవభక్తి గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కానీ ఇతర దేవుళ్లకు కాదు. ఎందుకంటే..? తిరుమల శ్రీవారు అపర కుబేరులు కదా..!’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆడియో ఫైల్ వ్యాపార వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.