న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్పై ఢిల్లీలో మరో కేసు నమోదైంది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేసే విషయమై ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. గడువులోగా స్పందించకపోవడంతో ట్విట్టర్.. మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది.
దీంతో ట్విట్టర్లో యూజర్లు చేసే పోస్టుల విషయమై ఈ సోషల్ మీడియా దిగ్గజానికి వ్యతిరేకంగా కేసులు నమోదవుతున్నాయి. బాలల అశ్లీల సాహిత్యం అంశంపై ఢిల్లీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం, పోస్కో చట్టాల కింద ట్విట్టర్పై కేసు నమోదు చేసింది. దీంతో మైక్రో బ్లాగింగ్ సైట్పై నమోదైన కేసులు నాలుగుకు చేరాయి.
ట్విట్టర్లో నిరంతరం బాలల అశ్లీల సాహిత్యం పోస్ట్ చేస్తున్నారని ఢిల్లీ సైబర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎన్సీపీసీఆర్ పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసు కమిషనర్కు, సైబర్ సెల్ విభాగానికి ఎన్సీపీసీఆర్ లేఖలు కూడా రాసింది.
ఇంతకుముందు యూపీలో ఫేక్ వీడియో అప్లోడ్పై ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా జమ్ముకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపుతూ భారత చిత్ర పటాన్ని పోస్టు చేసినందుకు యూపీ, మధ్యప్రదేశ్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.