Millet Policy | న్యూఢిల్లీ, జూన్ 6: ప్రాచీన కాలం నుంచి భారతీయ రైతులు పండిస్తూ వస్తున్న తృణ ధాన్యాలపై తమ సహజసిద్ధ హక్కును కోల్పోనున్నారా? జొన్న, రాగి, కొర్ర, అరికె వంటి పంటలు పండించాలంటే ఇకనుంచి ఏ కార్పొరేట్ కంపెనీ కాళ్లో పట్టుకోవాల్సిందేనా? ప్రతి రైతు ఇంట్లో మట్టికుండల్లో నిల్వ ఉంచే స్వచ్ఛమైన విత్తనాలు ఇక కనుమరుగు కావాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు మేధావులు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, ఆర్భాటంగా ప్రకటించిన ‘మిల్లెట్ పాలసీ’ భారతీయ రైతుల హక్కులను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టబోతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల ఆహారంలో మళ్లీ మిల్లెట్లను భాగం చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం అనుసరిస్తున్న విధానంలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.
విత్తనంపై హక్కు ఎవరిది?
భారత ప్రభుత్వ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి 2023ను ‘అంతర్జాతీయ తృణ ధాన్యాల’ సంవత్సరంగా ప్రకటించింది. దీంతో మోదీ సర్కారు మిల్లెట్ మిషన్ పేరుతో దేశంలో తృణ లేదా చిరు ధాన్యాల సాగు, ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు ప్రచారం మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ బాధ్యతను తీసుకొన్నారు. గత మార్చి నెలలో ఢిల్లీలో ‘గ్లోబల్ మిల్లెట్ కాన్ఫరెన్స్’ను నిర్వహించారు. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో మిల్లెట్ల వినియోగం గురించి మోదీ గొప్పగా చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో రెండురోజులపాటు మిల్లెట్ ఫెస్టివల్ను నిర్వహించి పార్లమెంటు సభ్యులందరికీ మిల్లెట్లతో చేసిన విందు కూడా ఇచ్చారు. అయితే, మోదీ సర్కారు తెచ్చిన మిషన్ మిల్లెట్పై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తున్నది.
ఈ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మిల్లెట్ విత్తనాలపై హక్కులను కార్పొరేట్ సంస్థలు, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లకు గంపగుత్తగా ధారాదత్తం చేయబోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలు రైతుల హక్కుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మిల్లెట్ల ఉత్పత్తి పెంచటానికి విత్తన కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో వందల ఏండ్లుగా రైతులు కాపాడుతూ వస్తున్న ఈ తృణ ధాన్యాల విత్తనాలపై హక్కులు ఇకనుంచి విత్తన కంపెనీల చేతుల్లోకి వెళ్లనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే రైతులు జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, అరికెలు, సామలు, అండుకొర్రలు వంటి చిరు ధాన్యాలు పండించాలంటే సీడ్ కంపెనీల వద్దనే విత్తనాలు కొనా ల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రోత్సాహమేది?
వరి వంటి అధిక నీరు అవసరమైన పంటలతో పోల్చితే తృణ ధాన్యాలు పండించటానికి చాలా తక్కువ సంఖ్యలో వనరులు అవసరం అవుతాయి. ఒక కిలో రాగులు పండించటానికి 600 లీటర్ల నీరు అవసరమైతే, ఒక కిలో ధాన్యం పండించటానికి 6000 లీటర్ల నీరు అవసరం. తృణ ధాన్యాలు పండించటానికి కృత్రిమ ఎరువులు, పురుగుమందులు కూడా అవసరం లేదు. నీటి పారుదల వసతి లేకున్నా వర్షాధారంతోనే ఈ పంటలు పండించవచ్చు. దీంతో ఈ పంటలు అధికంగా పండిస్తే పర్యావరణానికి మేలు మాత్రమే కాదు. ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. ఎలా అంటే.. వరి, గోధుమ వంటి పంటలకు కేంద్రప్రభుత్వం కరెంటు, ఎరువులు, పురుగుమందులకు సబ్సిడీ రూపంలో ఏటా ఎకరానికి ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో రూ.7000 నుంచి రూ.8000 వరకు ఇస్తున్నది. వీటికి కనీస మద్దతు ధర కూడా ప్రకటిస్తున్నది.
కానీ, మిల్లెట్ పంటలకు ఎంఎస్పీ ఇవ్వటం లేదు. పైగా కరెంటు, ఎరువులు, పురుగు మందులకు ఇచ్చే సబ్సిడీ కేంద్రానికి మిగులుతున్నది. అలాంటప్పుడు కేంద్రం నిజంగా మిల్లెట్ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలనుకొంటే ఆ రూ.7-8 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వ వచ్చుకదా? మిల్లెట్లకు కూడా ఎమ్మెస్పీ ఇవ్వవచ్చు కదా? అని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వరి, గోధుమ వంటి పంటలతో పోల్చితే మిల్లెట్ పంటలు పండిస్తే రైతుకు వచ్చే లాభం చాలా తక్కువ. అలాంటప్పుడు రైతులు లాభాలు వచ్చే పంటలను వదిలేసి, ఇతర పంటలను ఎందుకు సాగుచేస్తారని నిలదీస్తున్నారు.
తిండి అలవాట్లు మార్చటం సాధ్యమేనా?
రెండుమూడు దశాబ్దాల క్రితం వరకూ దేశంలో ప్రతి ఒక్కరికీ తృణ ధాన్యాల ఆహారం తిన్న అనుభవమే. హరిత విప్లవం కారణంగా దేశంలో వరి, గోధుమ పంటల దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో ప్రజలందరికీ బియ్యం, గోధుమలు చవకగా దొరకటం మొదలైంది. దీంతో మిల్లెట్ల స్థానంలో వరి, గోధుమ వంటివి ప్రజల ప్రధాన ఆహారంగా మారాయి. ఇప్పుడు కేంద్రం మళ్లీ ప్రజలను మిల్లెట్లు తినేలా ప్రోత్సహించాలని భావిస్తున్నది. మిల్లెట్లు ప్రధాన ఆహారంగా మారాలంటే ముందు వాటి ధరలు తగ్గాలి. ప్రస్తుతం కిలో బియ్యం రూ.40-45కు లభిస్తుండగా, కిలో జొన్నలు రూ.80 దాటాయి.
అంతేకాకుండా బియ్యాన్ని ఆహారంలో భాగం చేసుకోవటం చాలా తేలిక. జొన్నలను ఆహారంగా తీసుకోవటానికి సమయం పడుతుంది. అరికెలు, కొర్రలు, సామల వంటివాటిని ముందుగా కనీసం ఐదారు గంటలైనా నీటిలో నానబెట్టి వాడుకోవాలని, లేదంటే ఇబ్బందులు వస్తాయని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. అందునా రోజువారీ ఆహారంలో మిల్లెట్లు 30 శాతమే ఉండాలని, మిగతా 70 శాతం కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. పేద ప్రజలు అధికంగా ఉండే మనదేశంలో ఇది సాధ్యమేనా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.