హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడినట్టు పేర్కొన్నది. ఇదిలా ఉంగా.. శనివారం పలు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 63 మిల్లీమీటర్లు, బాన్సువాడ మండలంలో 56.3 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్సీపురం, పటాన్చెరులో ఓ మోస్తరు వర్షం కురిసింది.