Union Govt on Whatsapp & Telegram | ఇక వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ల్లో కీలక సమాచారం, పత్రాల షేరింగ్ సురక్షితం కాదని అధికారులకు కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యమైన డేటా షేర్ చేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్ యాప్లను అసలు వాడొద్దని ఉద్యోగులందరినీ ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్ల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయని, దేశ భద్రత సమాచారాన్ని భారత వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం సమయంలో కేంద్ర ప్రభుత్వ సాధనాల ద్వారా మాత్రమే అనుసంధానం కావాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు ఐఎఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది. అమెజాన్ అలెక్సా, ఆపిల్ హోమ్ పాడ్, గూగుల్ మీట్, జూమ్ తదితరాలకు కూడా ఈ నిబందనలు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలోని లొసుగులను విశ్లేషించాకే వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్లను వాడొద్దని కేంద్రం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ రహస్య సమాచార లీక్ కావడంతోపాటు జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు & ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యాప్లతో అనుసరించాల్సిన విధివిధానాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ శాఖల అధికారులు పాటించాలని సూచించింది. గోప్యమైన లేదా జాతీయ భద్రత సమస్యలపై జరిగే సమావేశాల్లో స్మార్ట్-వాచీలు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని కేంద్రం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు వర్చువల్ సమావేశాలకూ వర్తిస్తుందని తెలిపింది.