న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని ఆజాద్పూర్లోగల లాల్బాగ్ ఏరియాలో ఘోరం జరిగింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలి 17 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. లాల్బాగ్ ఏరియాలోని ఓ భవనం మూడో అంతస్తులో పప్పుకుమార్ అనే వ్యక్తి ఖాళీ సిలిండర్ను తొలగించి నిండు సిలిండర్ను అమరుస్తుండగా మంటలు అంటుకుని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. 2వ అంతస్తులోని నాలుగు పోర్షన్లు కూడా దెబ్బతిన్నాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనలో మొత్తం 17 మంది గాయపడినట్లు గుర్తించి స్థానిక బీజేఆర్ఎం ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.