Gujarat | మండ్వి/అహ్మదాబాద్, జూన్ 14: బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. గురువారం తుఫాను తీరాన్ని తాకనుండటంతో అధికారులు 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. సహాయక చర్యలపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం కచ్, సౌరాష్ట్ర వైపు తుఫాను దిశ మార్చుకొన్నదని, ఈశాన్య దిశగా ముందుకు సాగుతున్నదని, గురువారం సాయంత్రం జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతం కావచ్చని ఐఎమ్డీ తెలిపింది. ప్రస్తుతానికి కచ్కు 290 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని గుజరాత్ రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ వెల్లడించారు.
గాలుల వేగం పెరగడంతో తీర ప్రాంతాల్లో 4 వేల హోర్డింగులను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. ఐఎమ్డీ అంచనా ప్రకారం బుధవారం నుంచి గంటకు 65-75 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. బిపర్జాయ్ తుఫాను ఈ నెల 16న రాజస్థాన్పైనా ప్రభావం చూపనుందని ఐఎమ్డీ వెల్లడించింది. మరోవైపు తుఫాను తమ జీవనోపాధిపై ప్రభావం చూపవచ్చని నౌకల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతంలోనే నౌకలను తయారు చేస్తామని, 3 వేల టన్నుల బరువుండే చెక్క నౌకల తయారీకి రెండేండ్లు పడుతుందని, వాటిని ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించలేమని వారు వాపోతున్నారు. తుఫాను కారణంగా డామన్లోని బీచ్లలో 144 సెక్షన్ విధించినట్టు అధికారులు తెలిపారు.