ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నవీ ముంబై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ పోలీస్ అధికారి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ తెట్లే (38) అనే వ్యక్తి నవీ ముంబై పీఎస్లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ముంబై శివార్లలోని చునాబట్టి ఏరియాలోగల పోలీస్ క్వార్టర్స్లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తలు ఇద్దరూ భోజనం చేసి పడుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ తెల్లారేసరికి ప్రకాశ్ తెట్లే హాల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లారి నిద్ర లేచిన భార్య బయటికి వచ్చే౦దుకు ప్రయత్నిస్తే బెడ్రూమ్కు బయటి నుంచి గడియపెట్టి ఉంది.
దాంతో పక్కింటివాళ్లకు ఫోన్చేసి సాయం కోరింది. వాళ్లు మెయిన్ డోర్ లోపలి నుంచి గడియ పెట్టి ఉందని చెప్పడంతో కీడు శంకించిన ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగ్గొట్టి చూసేసరికి తెట్లే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. భార్య లోపలే ఉండగా బెడ్రూమ్కు బయటి నుంచి గడియపెట్టి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.