లక్నో: ఒక పార్టీకి చెందిన నేతలు రెండు స్థానాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ అసలు అభ్యర్థి ఎవరో తెలియక గందరగోళం నెలకొన్నది. (Samajwadi Candidates) ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. 2022 లోక్సభ ఉపఎన్నికలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) టికెట్పై రాంపూర్లో పోటీ చేసిన అసిమ్ రాజా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ మసీదుకు చెందిన ఇమామ్ మొహిబుల్లా నద్వీ కూడా అదే స్థానం నుంచి పోటీ కోసం బుధవారం నామినేషన్ వేశారు. ఎస్పీ అధికార అభ్యర్థిని తానేనని, అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మద్దతు తనకు ఉందని నద్వీ తెలిపారు.
కాగా, మొరాదాబాద్ స్థానంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. ఎస్పీ నేత రుచి వీర బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అభ్యర్థి తానేనని మీడియాతో అన్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ ఎస్టీ హసన్ మంగళవారమే నామినేషన్ వేశారు. దీంతో ఎస్పీ నేతలు ఇద్దరేసి చొప్పున రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడంతో గందరగోళం నెలకొన్నది. ఎవరు అసలైన పార్టీ అభ్యర్థో తెలియడం లేదు.
మరోవైపు తమది ప్రజాస్వామ్య పార్టీ అని ఎస్పీ అధికార ప్రతినిధి ఫర్రుల్ హసన్ చంద్ తెలిపారు. నామినేషన్ల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. పార్టీ అధిష్టానం ఎవరిని కోరితే వారు ఎన్నికల పోటీలో ఉంటారని, సాయంత్రానికి అభ్యర్థులపై స్పష్టత వస్తుందన్నారు.
కాగా, ఏప్రిల్ 19న మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాంపూర్, మొరాదాబాద్ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. ఈ రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలకు బుధవారం చివరి రోజు.