న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా నియంత్రణ కోసం ఆ రూల్స్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. భారత్లో ఉన్న చట్టాలకు లోబడే పనిచేయనున్నట్లు ట్విట్టర్ పేర్కొన్నది. భారత ప్రభుత్వంతో నిరంతరం సమగ్రపూర్వక చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పింది. కానీ ఇటీవల ఢిల్లీలోని గురుగ్రామ్లో జరిగిన కొన్ని ఘటనల పట్ల ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ సంస్థ ఉద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ట్విట్టర్ ఖండించింది. స్వేచ్చాయుత ఐటీ రూల్స్కు అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని ట్విట్టర్ వెల్లడించింది. ఓ బీజేపీ నేత ట్వీట్ల విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు ఆమోద్యయోగంగా లేదని ఆ సంస్థ పేర్కొన్నది. మహమ్మారి వేళ తమ సేవలు కీలకంగా నిలిచాయని, ఎంతో మందికి మద్దతు ఇచ్చినట్లు ట్విట్టర్ వెల్లడించింది. కొత్తగా తెచ్చిన ఐటీ చట్టాల్లో కొన్ని మార్పులు చేయాలన్న సూచన చేసింది. భావ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.
సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లు.. ఇండియాలో కాంప్లియన్స్ ఆఫీసర్ను నియమించాలని కొత్త చట్టంలో నిబంధన విధించారు. ఇక సమస్యలను పరిష్కరించేందుకు కూడా గ్రీవియన్స్ రెస్పాన్స్ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. కోర్టు ఆదేశాలు వచ్చిన 36 గంటల్లో తమ ఫ్లాట్ఫామ్ల నుంచి సంబంధిత సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ కొత్త నిబంధనల పట్ల వాట్సాప్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. కొత్త రూల్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, యూజర్ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నట్లు ఉందని వాట్సాప్ ఆరోపించింది.