న్యూఢిల్లీ : కరోనా కల్లోలం కొనసాగుతుండగానే మహమ్మారి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ద్వారా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ మ్యుటేట్ కావడం ద్వారా థర్డ్ వేవ్ లో చిన్నారులను ప్రభావితం చేస్తుందనే సంకేతాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదని పేర్కొంది. తొలి వేవ్ పెద్దలపై పెను ప్రభావం చూపగా సెకండ్ వేవ్ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని, థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
థర్డ్ వేవ్ పిల్లలకు ఎక్కువగా సోకుతుందనే వాదన వాస్తవాల ఆధారంగా వెల్లడించింది కాదని పీడియాట్రిక్స్ అసోసియేషన్ స్పష్టం చేసిందని చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. మరోవైపు చిన్నారులకు కరోనా తీవ్రత పెద్దగా ఉండదని, వీరిలో మహమ్మారి బారినపడి మరణించే అవకాశం అతితక్కువగా ఉంటుందని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ ఇటీవల పేర్కొన్నారు.