బెంగళూరు, డిసెంబర్ 14: వెంట్రుకకంటే 10 వేలరెట్లు సన్నం, ఉక్కుకంటే వందరెట్లు ధృడమైన వస్తువు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి వస్తువును సృష్టించింది బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ. నగరంలోని నోపో నానో టెక్నాలజీస్ అనే సంస్థ భూమిపై అత్యంత ధృడమైన కార్బన్ నానో ట్యూబులను సృష్టించింది. సిలిండర్లా ఉండే ఈ సింగిల్ పొర ట్యూబులు ఉక్కుకంటే 100 రెట్లు గట్టివని సంస్థ వ్యవస్థాపకుడు గధాదర్రెడ్డి తెలిపారు. గాలి చొరబడని కంటెయినర్లలో నిల్వ ఉంచిన ఈ కార్బన్ ట్యూబులను సాధారణ కంటితో కూడా చూడవచ్చని చెప్తున్నారు. నానో టెక్నాలజీతో అత్యంత సన్నని, ధృడమైన వస్తువులను సృష్టిస్తున్న ఈ సంస్థ పరిశోధనలు ఇప్పటికే నీతి ఆయోగ్తోపాటు ఎలాన్మస్క్ కంపెనీ టెస్లాను కూడా ఆకర్షించాయి.
ఈ కార్బన్ ట్యూబుల సహాయంతో భవిష్యత్తులో అంగారకుడిపైకి మానవ ప్రయాణాన్ని సులభతరం చేయటమే తమ లక్ష్యమని గధాదర్రెడ్డి చెప్తున్నారు. ఈ టెక్నాలజీని గగనతల పరిశోధనలతోపాటు కంప్యూటర్స్, ఆటోమోటివ్స్, బ్యాటరీస్, వాటర్ఫిల్టర్లు, ఫర్టిలైజర్స్, వస్ర్తాలు, ఔషధాలు తదితర రంగాల్లో విరివిగా ఉపయోగించే కాలం అతిత్వరలోనే ఉన్నదని చెప్పారు.