Congress working committee | తమ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న అసమ్మతి నేతలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వేటు వేసే పరిస్థితులేమీ లేవు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్,పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలందరిని ఐక్యంగా ముందుకు తీసుకెల్లే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అనుసరించవచ్చునని తెలుస్తోంది.
జీ-23 గ్రూప్గా రూపొందిన సీనియర్ లీడర్లు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి అసమ్మతివాదులు పార్టీలో అంతర్గతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి పూర్తిస్థాయి, శక్తిమంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటూ సోనియాగాంధీకి జీ23 గ్రూప్ నేతలు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి తాత్కలిక అధ్యక్షుడి ఎన్నికకు బదులు పూర్తిస్థాయి అధినేతను ఎంపిక చేయడానికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చేపట్టబోతున్నదని ఆ పార్టీ వర్గాల కథనం. అందుకోసం విధాన నిర్ణాయక వేదిక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం జరుగనున్నది.
2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు జిల్లా స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ చేపడతారు.