లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇందులోనూ కాస్త స్పెషల్ పాటించారు. నిందితులందరూ వచ్చే గేటు నుంచి కాకుండా.. వెనుక గేటు నుంచి ఆశీష్ మిశ్రా బయటకు వచ్చారు. బెయిల్కు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం ఉదయం జిల్లా జడ్జి నుంచి జైలు అధికారుల దగ్గరికి చేరాయి. ఆ తర్వాత ఆశీష్ మిశ్రా తరపు న్యాయవాది బెయిల్కు సంబంధించిన పత్రాలను నింపారు. బెయిల్కు సంబంధించిన విధి విధానాలన్నీ పూర్తైన తర్వాత ఆశీష్ మిశ్రా అందరిలాగా కాకుండా వెనుక గేట్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడమని కోరగా… తిరస్కరిస్తూ… కారు ఎక్కి, తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే ఎందుకు వెనుక గేటు నుంచి వచ్చారు అని జైలు అధికారులను అడగ్గా… భద్రతకు సంబంధించిన అంశాలను పేర్కొంటూ సమాధానమిచ్చారు. అయితే షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. సాక్షులతో సహా.. ఎవ్వర్నీ ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశించింది.
సరిగ్గా యూపీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రోజునే లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల మీదుగా వాహనాలు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. ఈ సమయంలో వాహనాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం నడుపుతున్నారన్న అభియోగంపై అక్టోబర్ 9న ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.