హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిముని మనుమరాలు జెహ్రా మీర్జా తన వితరణతో అలనాటి యువరాణి ప్రిన్స్ నిలోఫర్ను గుర్తుకు తెస్తున్నది. జెహ్రా స్వతహాగా మంచి చిత్రకారిణి. కొవిడ్ సమయంలో తన పెయింటింగ్స్ను విక్రయానికి ఉంచి.. ఆ సొమ్ముతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నది. అలా, ఇప్పటి వరకూ దాదాపు నాలుగు లక్షల రూపాయలు సేకరించి, కొవిడ్ బాధితుల కోసం ఖర్చు చేసింది. ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన జెహ్రా క్యాన్సర్ రోగులకు సాయంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ‘ఒక చిత్రకారిణిగా నేను జీవితంలోని అందాన్ని మాత్రమే చూశాను. కానీ, ప్రస్తుత పరిస్థితులు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఏదో ఓ రూపంలో నిరుపేదలకు సాయం చేయాలని నిశ్చయించాను’ అంటుందామె. జెహ్రా అమెరికాలో చదువుకొంది. ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్సు కూడా చేసింది.