కోల్కతా: కరోనా కాలంలో అంబులెన్సుల యజమానులు దందా నిర్వహిస్తున్నారు. రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. తామెంత చెబితే అంత ఇవ్వాల్సిందేనని, లేకపోతే వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగుల కుటుంబీకులు వారడిగినంత ఇస్తున్నారు. కేవలం 40 కి.మీ. దూరానికి రూ.17 వేలు వసూలు చేశాడో అంబులెన్స్ ఓనర్. ఈ విస్తుపోయే ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది.
బెంగాల్లోని అసన్సోల్కు చెందిన సుభోదీప్ సేన్ అనే వ్యక్తి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతన్ని అత్యవసరంగా దుర్గాపూర్లో ఉన్న దవాఖానకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం ఓ అంబులెన్సును మాట్లాడుకున్నారు. అయితే ఆ అంబులెన్స్ యజమాని వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక డబ్బులు డిమాండ్ చేశాడు. అసన్సోల్, దుర్గాపూర్ మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు 40 కి.మీ. దూరానికి రూ.17 వేలు ఛార్జ్ చేశాడు. ఇప్పటికి గండం గట్టెక్కితే చాలనుకున్న సుభోదీప్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అంబులెన్స్లో తన తండ్రిని దవాఖానకు తీసుకెళ్లాడు.
కాగా, ఈ దోపిడీపై చీఫ్ మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశానని, అంబులెన్స్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని సుభోదీప్ సేన్ అధికారులను కోరారు. ఒక్క పశ్చిమబెంగాల్లోనే కాదు, ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి.