న్యూఢిల్లీ, జూన్ 7: కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా, ఇతర డిమాండ్లతో శనివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తాము నిర్వహించిన ఆందోళన కేవలం ట్రైలర్ మాత్రమేనని, మంత్రి దిగేపోయే వరకు ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. సీజేపీ ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగిన నిరసనకు పెద్దయెత్తున తరలి వచ్చిన తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఆందోళనకారులు, విద్యార్థులు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నిన్నటి ఆందోళనకు వేలాది మంది హాజరై చరిత్ర సృష్టించారు. ఐక్యంగా ఉంటే బొద్దింకలు ఏమన్నా చేయగలవని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళన ద్వారా ప్రభుత్వానికి ఒక ట్రైలర్ చూపించాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
అంతకుముందు ఏ ఆందోళనలో పాల్గొనని వారు సైతం జంతర్మంతర్లో తాము జరిపిన ఆందోళనలో భాగస్వాములయ్యారని ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థపై ఉన్న అసహనాన్ని, కోపాన్ని తెలియజేసేందుకు సామూహిక ఉనికితో ఇందులో పాల్గొన్నారని చెప్పారు. మన గళాలు విన్పించకపోతే మార్పు సాధ్యం కాదన్నారు. శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం తాకలేదన్నారు. మాలాంటి బొద్దింకలకు వారంటే భయపడాల్సిన అవసరం ఎప్పుడూ లేదన్నారు. ‘మన ఉద్యమం ఇక్కడితో ఆగిపోదు. ఒక తరాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుదోవ పట్టించారు. వచ్చే వారంలోగా ఆయనను తొలగించకున్నా లేదా దిగిపోకున్నా మా నిరసనను క్షేత్ర స్థాయిలో కొనసాగిస్తాం’ అని దీప్కే హెచ్చరించారు.