ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
గ్రాడ్యుయేట్స్ చూపు.. పల్లా వైపు
ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి
జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు,సమావేశాలు
ఖమ్మం, మార్చి 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. గత నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా అప్పటి నుంచి మంత్రి అజయ్కుమార్ పక్కా ప్రణాళికతో సమావేశాలు నిర్వహించారు.. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. క్షేత్రస్థాయిలో పట్టభద్రులను కలిసి పార్టీ అభ్యర్థి పల్లాకు ఓటు వేయాలని అభ్యర్థించారు.. ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు..
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. గత నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అప్పటి నుంచి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు కోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణులు పనిచేశాయి. రెండు నెలల నుంచి పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రతి మండల కేంద్రంలో క్షేత్రస్థాయికి వెళ్లి పట్టభద్రులను కలిశారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆదివారం పోలింగ్ జరుగనుండడంతో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 71 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ బరిలో నిలవగా.. పట్టభద్రుల మొగ్గు పల్లా వైపే ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకు ప్రచారంలో టీఆర్ఎస్కు వచ్చిన మద్దతే నిదర్శనమంటున్నారు.
ప్రజాప్రతినిధులు, నాయకుల ముమ్మర ప్రచారం
ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభానికి ముందు నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ భద్రాచల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావ్, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి తాటి వెంకటేశ్వర్లు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేషన్ మేయర్ డాక్టర్ పాపాలాల్ విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాయి. నాయకులు, కార్యకర్తలు పల్లాకు రాజేశ్వర్రెడ్డికి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రచారంలో పట్టభద్రుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు స్వచ్ఛందంగా పల్లా రాజేశ్వర్రెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన గెలుపు ఖాయమన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం పీఆర్సీకి సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నించే గొంతుక పల్లాను గెలిపించాలని ఆయా వర్గాలు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సమావేశాలు, సమ్మేళనాలకు అనూహ్య స్పందన
పట్టభద్రుల పోరులో మెజార్టీయే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులు మొదటి నుంచి ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగాయి. నాయకులు అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రధాన అస్ర్తాలుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలు టీఆర్ఎస్కు మరింత కలిసి వచ్చాయి. సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారంతా పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సీఎం కేసీఆర్ పాలనకు మద్దతు తెలుపుతామని పేర్కొనడం కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపింది.
పట్టభద్రులను కలిసేందుకు బాధ్యుల నియామకం..
టీఆర్ఎస్ నాయకులు ప్రతి పట్టభద్రుడిని కలిసేలా పార్టీ ప్రతి 50 మంది పట్టభద్రుల ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించింది. వీరు పట్టభద్రులను కలిసి అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న తీరును వివరించారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లాకు మద్దతు కూడగట్టారు.
పువ్వాడ అజయ్ ఇంటింటి ప్రచారంతో జోష్
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం నగరంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆయన నేరుగా పట్టభద్రులను కలిసి పల్లాను గెలిపించాలని కోరడం, బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడం, కాంగ్రెస్ల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటివి.. కార్యకర్తల్లో జోష్ నింపాయి. రాష్ర్టానికి టీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్, బీజేపీతో ఒరిగేది ఏమీ లేదని ప్రచారం నిర్వహించడం పార్టీకి కలిసివచ్చింది.