బెంగళూరు : కర్నాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. కొప్పల్ నగరంలోని భాగ్యనగర్లో ఓ చిన్న షెడ్డులో తలదాచుకుంటున్న గిరిజమ్మ అనే మహిళకు (Karnataka Woman) ఏకంగా రూ. లక్ష కరెంట్ బిల్లు రావడం కలకలం రేపింది. గతంలో ఆమె విద్యుత్ను వాడుకున్నందుకు నెలకు రూ. 70 నుంచి రూ. 80 వరకూ బిల్లు వచ్చేది. బతికేందుకే ఇబ్బంది పడుతున్న వృద్ధ మహిళ భారీ మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో కలత చెందుతూ సాయం చేయాలని మీడియాను ఆశ్రయించింది.
ఈ ఘటనపై స్పందించిన మీడియా కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ను సంప్రదించగా మీటర్లో లోపంతోనే కరెంటు బిల్లు తప్పుల తడకగా వచ్చిందని, ఆమె అధిక బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మంత్రి సూచనతో గుల్బర్గా విద్యుత్ సరఫరా కంపెనీ (జెస్కం) గిరిజమ్మ షెడ్డును సందర్శించింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ విద్యుత్ మీటర్ను తనిఖీ చేసి సాంకేతిక లోపం ఉన్నట్టు నిర్ధారించారు.
సిబ్బంది, బిల్లు కలెక్టర్ పొరపాట్ల కారణంగా భారీగా కరెంటు బిల్లు వచ్చిందని గుర్తించారు. ఈ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు మహిళకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్ రేట్లను పెంచి అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలపై భారం మోపుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గృహ లక్ష్మి పధకం కింద 200 యూనిట్లలోపు గృహ వినియోగంపై ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు విద్యుత్ టారిఫ్ల పెంపునకు వ్యతిరేకంగా పరిశ్రమ సంఘాలు బంద్కు పిలుపు ఇచ్చాయి.
Read More :