బండరాళ్లు తొలగించి పల్లెప్రకృతి వనం ఏర్పాటు
ఆహ్లాదం పంచుతున్న మల్కాపూర్(ఏ) విలేజ్ పార్కు
అనంత పద్మనాభ స్వామిఆలయ సమీపంలో ..
నిజామాబాద్ రూరల్, మార్చి 22: నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం సుందరంగా తీర్చిదిద్దడంతో గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. దీంతో ఆలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి సేద తీరుతున్నారు. పార్కు ఏర్పాటు చేసిన ఎకరం స్థలంలో పెద్దపెద్ద బండరాళ్లు ఉండేవి. గ్రామపంచాయతీ నిధులు రూ.50వేలతో జేసీబీ సహాయంతో బండరాళ్లను, ముళ్ల పొదలను తొలగించారు. ఉపాధి కూలీలు ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని చదును చేసి మైదానంగా మార్చారు. పల్లెప్రకృతి వనంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు సర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు గ్రామానికి చెందిన పలువురు దాతలు విరాళం అందించి తమ వంతు సహకారం అందించారు. పిల్లల కోసం ఆట వస్తువులను సైతం ఏర్పాటు చేశారు. పార్కులో రెండు వేల మొక్కలు నాటారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పార్కు ప్రాంగణంలో పైపులైన్ వేసి నీటి వసతి కల్పించారు. ఫలితంగా నాటిన మొక్కలకు వనసేవకులు నిత్యం నీళ్లు పోస్తున్నారు.