న్యూఢిల్లీ, జూన్ 25: బీజేపీని అధికారం నుంచి దించడమే ప్రధాన లక్ష్యంగా పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కోరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ తరచూ రాహుల్ గాంధీ ప్రేమ గురించి మాట్లాడుతుంటారని, అలాంటప్పుడు ఎవరు ఏమి అడిగినా ప్రేమతో అంగీకరించాలి కదా? అని ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని, రేపు పదవిలోకి వస్తే పరిస్థితి ఏమిటని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ స్పందిస్తూ ఆప్ ఒక పక్క ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ పార్టీ మద్దతు కోరుతూనే మరోపక్క తీవ్ర విమర్శలు చేస్తున్నదని విమర్శించారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ చెంతన చేరారని, విపక్షాల ఐక్యతను చెడగొట్టడమే ఆయన ప్రధాన లక్ష్యమని అజయ్ మాకెన్ విమర్శించారు.