మిర్యాలగూడటౌన్, డిసెంబర్ 11 : మిర్యాలగూడ పట్టణంలోని పార్కులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. నిరాదరణకు గురై, కంపచెట్లతో నిండి ఉన్న పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించింది. స్వరాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం-2019 ప్రకారం పార్కుల నిర్వహణను మున్సిపాలిటీకి అప్పగించడంతో వాటి రూపురేఖలు మారిపోయాయి. పచ్చదనం పెరగడంతో పట్టణ ప్రజలు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
పార్కుల్లోనే ఓపెన్ జిమ్లు
మిర్యాలగూడ పట్టణంలో మొత్తం 13 పార్కులు ఉన్నాయి. ఇందులో ఎన్నెస్పీ క్యాంపులోని సుందరయ్య పార్కు పెద్దది కాగా.. మిగతావి మినీ పార్కులు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పార్కుల్లో వసతులు కల్పించడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యతను కూడా చేపడుతున్నారు. పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ మున్సిపాలిటీకి అమృత్ పథకం కింద మంజూరైన రూ. 60 లక్షలతో పార్కుల్లో సదుపాయాలు కల్పించారు. ప్రహరీ నిర్మాణం, ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బల్లలు, వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, పిల్లల కోసం ఆట పరికరాలు ఏర్పాటుచేశారు. మరికొన్ని పార్కుల్లో ఆకర్షణీయంగా ముఖ ద్వారాన్ని నిర్మించారు. దాంతో పాటు పార్కుల్లోనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కునకు వెళ్లి ఆహ్లాదం, ఆరోగ్యం పొందుతున్నారు.
ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నాం
పట్టణంలోని పార్కుల నిర్వహణ బాధ్యత మున్సిపల్ శాఖ చేపట్టింది. పారిశుధ్యం, పచ్చదనం పెంచడం, వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం పార్కుల్లో వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, ప్రహరీ వంటివి ఏర్పాటు చేశాం. పార్కులు ప్రజలకు ఉపయోగపడేలా మున్సిపల్ శాఖ తరఫున వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
– రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ