– చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
చండూరు, సెప్టెంబర్ 03 : పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. స్థానిక గాంధీజీ విద్యాసంస్థలలో గురువారం ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, గొల్లభామల వేషధారణలో సందడి చేసి ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణ, ఉట్టికొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణాష్టమి విశిష్టతను ప్రతిబింబించేలా సాంస్కృత కార్యక్రమాలు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతోపాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పండుగల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రతి ఒక్కరు భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జాని, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

‘పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయి’