పిల్లలు.. పర్యావరణం
పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎప్పుడు కనాలి అన్న నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. ఎవరికి వాళ్లు తమ ఆర్థిక భద్రత, ఆరోగ్యం తదితర విషయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటారు. అయితే జనాభా పెరుగుదల, పర్యావరణం లాంటి అంశాలు కూడా ఈ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తున్నాయా? అన్న సందేహం కలిగింది అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులకు. దాంతో 18 నుంచి 35 లోపు యువతను ప్రశ్నించి చూశారు. తమ సందేహాలు నిజమేనని రుజువు చేసుకున్నారు. పరిశోధకులతో మాట్లాడినవారిలో చాలామంది పరిమిత వనరుల మధ్య పిల్లల్ని కనడం వల్ల కాలుష్యానికి మరింత దోహదపడతామేమోనని భయపడుతున్నారట. మరికొందరేమో, జనాభాను మరింతగా పెంచడం ఎందుకన్న ఆలోచనలో ఉన్నారట. ఇంకొందరు, పుడమి భవిష్యత్తు గురించి కంగారుపడి పిల్లల్ని కనాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అయితే కొద్దిమంది మాత్రం రాబోయే తరం మరింత జాగ్రత్తగా, తెలివిగా మెలిగి… పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తగ్గిస్తారనీ, పుడమిని రక్షిస్తారనీ ఆశగా ఉన్నారు. సందేహపడేవాళ్లంతా ఈ ఆశావాదులను అనుసరిస్తే సరి.
షిఫ్టులవారీ ఆరోగ్యం
కాలం మారిపోయింది. పెరుగుతున్న సాంకేతికతతో పాటు, పనిచేయడానికి పగలూరాత్రీ అన్న తేడా లేకుండా పోయింది. రోజుకు ఇంత సమయంలో, ఇన్ని గంటల పని అనే లెక్కలు చెదిరిపోతున్నాయి. సహజంగానే ఇది ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఆ మాట నిజమే అంటున్నారు వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. నిర్ణీత సమయంలో కాకుండా ఎడాపెడా పనిచేయడం వల్ల జీవగడియారం మీద దాని ప్రభావం ఉంటుందని తేల్చారు. మన రోగ నిరోధక శక్తి కూడా ఈ జీవగడియారం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట ఇన్ఫెక్షన్లను తట్టుకునే సత్తా కాస్త తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో బయట తిరుగుతూనో, పని చేస్తూనో ఉంటే… వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. అంటే షిఫ్టులవారీగానో, నైట్ డ్యూటీలోనో పనిచేసేవారు త్వరగా జబ్బుపడే ప్రమాదం ఉందన్నమాట. పైగా ఈ సమస్య ఆడవారిలోకంటే మగవారిలో ఎక్కువగా కనిపించడం విశేషం.
ఆముదం మొక్కతో.. క్యాన్సర్ చికిత్స
మనం తేలికగా తీసుకొనే ‘అడవి ఆముదం మొక్క’ (Jatropha) నుంచి తయారుచేసే మందుతో క్యాన్సర్ను సమూలంగా అంతం చేయవచ్చని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. మెదడు, కాలేయం, ప్రొస్టేట్, ఊపిరితిత్తులు.. లాంటి అనేక కేన్సర్లలో BRAT1 అనే ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ కారణంగానే, చాలా క్యాన్సర్లు తిరిగి పుంజుకుంటూ, ప్రాణాంతకంగా మారుతాయి. జట్రోఫా నుంచి తీసిన ‘సర్క్యుసోన్-డి’ అనే పదార్థం ఈ ప్రొటీన్ను నాశనం చేయగలదని నిరూపించారు. ఈ మందు వల్ల కేన్సర్ కణాలు చనిపోతూ, పక్కకి విస్తరించకుండానే నాశనం అయిపోతాయి.
వ్యసనం కాదట
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 380 కోట్ల మంది సామాజిక మాధ్యమాలను వాడుతున్నారని అంచనా! సోషల్ మీడియాకు అలవాటుపడటం వల్ల సమయం మాత్రమే వృథా కావడం లేదు… రకరకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సోషల్ మీడియాను ఓ వ్యసనంగా భావించవచ్చా? అనే అనుమానం వచ్చింది స్కాట్లండ్ పరిశోధకులకు. ఈ విషయాన్ని తేల్చుకోవడానికి ఓ ప్రయోగం చేశారు. కొందరి చేతికి రకరకాల యాప్స్ ఉన్న ఫోన్లను ఇచ్చారు. వాటిలో ఎన్ని యాప్స్ ఉన్నా, ఠక్కున సోషల్ మీడియా యాప్స్ను గుర్తించగలిగితే… దాన్ని వ్యసనంగా భావించవచ్చని పరిశోధకుల అంచనా. సాధారణంగా, ఇలాంటి పద్ధతుల ద్వారానే జూదం, మద్యం లాంటి వ్యసనాలను గమనిస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా సోషల్ మీడియా యాప్స్కు ప్రత్యేక ప్రాధాన్యమేమీ లభించలేదు. అంటే, సోషల్ మీడియా అనేది వ్యసనం స్థాయికి రాలేదన్నమాట. సోషల్ మీడియా వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి కాబట్టి, అవసరానికి మించి వినియోగించకూడదన్నది పరిశోధకుల మాట.