రేపు ఉదయం 8 గంటల నుంచి మొదలు
విధుల్లో 10వేల మంది సిబ్బంది
నేడు పోలింగ్ సామగ్రి అందజేత
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
ఓటర్లకు గుర్తింపు కార్డు తప్పనిసరి
పోలింగ్ పూర్తయ్యాక 132
రూట్లలో నల్లగొండకు బాక్సులు
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో
రిటర్నింగ్ ఆఫీసర్ పీజే పాటిల్
నల్లగొండ ప్రతినిధి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న ఆదివారం ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్కు 3600మంది అధికారులతోపాటు సిబ్బందిని సిద్ధంగా ఉన్నారు. 5,05,565 మంది ఓటర్లకు గానూ 731పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు ఏదో ఒక గుర్తింపుకార్డు తప్పనిసరి అని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నమస్తే : పోలింగ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి?
ఆర్ఓ : పోలింగ్ ఏర్పాట్లు అన్నీ పూర్తిచేశాం. ఈ ఎన్నికల్లో 5,05565 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం 731పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నేటి ఉదయం నుంచి అన్ని జిల్లాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల ద్వారా పోలింగ్ సిబ్బందికి కేంద్రాలను కేటాయిస్తాం. అదేవిధంగా అవసరమైన పోలింగ్ సామగ్రిని కూడా అందజేస్తాం. ఈసారి బ్యాలెట్ బాక్స్లు పెద్దసైజ్లో ఉండడంతో వీటిని తరలించడం కొంత ఇబ్బందిగా మారింది. అందుకోసం పెద్దసైజ్ డోర్స్ కలిగిన పల్లె వెలుగు బస్సులను ఎంపికచేశాం. పోలింగ్ కేంద్రాలకు సాయంత్రానికి సిబ్బంది చేరుకుంటారు. రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. నాలుగు లోపు క్యూలో ఉన్న ఓటర్లను ఓటింగ్ అనుమతిస్తాం. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల లోపు ఎలాంటి ప్రచారాన్ని అనుమతించబోం.
నమస్తే : పోలింగ్ సిబ్బంది, బందోబస్తు సిబ్బంది వివరాలు?
ఆర్ఓ : నియోజకవర్గవ్యాప్తంగా 12జిల్లాల్లో అన్నిరకాల సిబ్బంది కలిపి మొత్తం 10వేల మంది వరకు రెండ్రోజుల పాటు విధుల్లో ఉంటారు. వీరిలో 3600మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇతర అన్నిరకాల విధుల్లో కలిపి మిగతా వారు ఉంటారు. ఇందులో పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చాం. ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, పోలింగ్ స్టేషన్లో నిర్వర్తించాల్సిన విధులు తదితరాలపై సంపూర్ణ అవగాహన కల్పించాం. బ్యాలెట్ పేపర్ సైజ్ కూడా పెద్దగా ఉండడంతో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని సూచించాం. ఇక పోలింగ్ నిర్వహణ సజావుగా సాగేందుకు 5వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వీరంతా కూడా నేటి నుంచి విధుల్లో ఉంటారు.
నమస్తే : సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని? తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటీ?
ఆర్ఓ : గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 227పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ఇక్కడ ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి ఆర్ఓ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తాం. వెబ్కాస్టింగ్ కోసం 460 మంది టెక్నికల్ సిబ్బందిని నియమించాం. వీరితో పాటు మరో 110మంది వీడియోగ్రాపర్స్ను కూడా ఎంగేజ్ చేశాం. ఎక్కడైనా సంఘటనలకు ఆస్కారం ఏర్పడితే వెంటనే దీన్ని రికార్డు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో అదనపు పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఇక బ్యాంకింగ్, ఎల్ఐసీ అధికారులతో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశాం. వీరు ఎప్పటికప్పుడూ పరిస్థితిని అంచనా వేస్తుంటారు.
నమస్తే : అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు?
ఆర్ఓ : ఈసారి మొత్తం 71మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందుకు అనుగుణంగానే బ్యాలెట్ పేపర్ సైజ్ కూడా పెరిగింది. దీంతో ప్రత్యేకంగా మహారాష్ట్రలో ముద్రించాల్సి వచ్చింది. తెలుపు రంగులో 18ఇంచుల పొడవు 24ఇంచుల వెడల్పుతో బ్యాలెట్ పేపర్ను రూపొందించాం. వీటికి అనుగుణంగా బ్యాలెట్ బాక్స్ల సైజ్ పెరిగింది. 2ఫీట్ల పొడవు, రెండు ఫీట్ల వెడల్పు, రెండున్నర ఫీట్ల ఎత్తుతో బ్యాలెట్ బాక్స్లను నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి తెప్పించాం. అదేవిధంగా వీటి తరలింపు కూడా ప్రయివేటు బస్సులు, స్కూల్ బస్సుల్లో సాధ్యపడడం లేదు. అందుకే ప్రత్యేకంగా పల్లె వెలుగు బస్సుల్లోనూ డోర్స్ వెడల్పుగా ఉండేవాటిని ఎంపిక చేశాం. వీటిల్లోనే బ్యాలెట్ బాక్స్లను తరలింపు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం.
నమస్తే : పోలింగ్ అనంతరం బాక్స్ల తరలింపు, భద్రత ఎలా ఉంటాయి?
ఆర్ఓ : పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ బాక్స్లను సీల్ చేస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాల్లో వీటిని తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. మొత్తం 12జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ జరుగనున్న నల్లగొండకు తరలించనున్నారు. అందుకోసం ఆయాప్రాంతాల నుంచి 132రూట్లను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ రూట్లలోనే పోలీసు ఎస్కార్ట్ వాహనాల సాయంతో నల్లగొండ పట్టణంలో ఆర్జాలబావి పరిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాములకు చేరవేస్తాం. ఇలా ములుగు, భద్రాచలం లాంటి దూరప్రాంతాల్లోని బ్యాలెట్ బాక్స్లన్ని నల్లగొండకు చేరడానికి పోలింగ్ ముగిసాక మరో 12గంటల సమయం తీసుకోవచ్చని భావిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు స్ట్రాంగ్ రూమ్స్లో బ్యాలెట్ బాక్స్లను భద్రపరుస్తాం. ఈ స్ట్రాంగ్ రూమ్స్కు కూడా అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో సీల్ చేస్తాం. ఇక్కడ కౌంటింగ్ వరకు పూర్తి భద్రత కొనసాగుతుంది.
నమస్తే : కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి?
ఆర్ఓ : కౌంటింగ్ ప్రక్రియపై చాలా కసరత్తు చేశాం. 17వ తేదీ ఉదయం 8గంటల నుంచి నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి వేర్ హౌసింగ్ గోదాంలలోనే చేపట్టేందుకు ఏర్పాట్లు చేశాం. ఎనిమిది రూమ్స్లో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో రూమ్లో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నాం. 25పేపర్ల చొప్పున ఒక బండిల్గా కడతారు. వీటిల్లోనే పోస్టల్ బ్యాలెట్లను కూడా కలిపేస్తారు. తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లపై 56వేల ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. పోల్ అయిన ఓట్లను బట్టి రౌండ్ల సంఖ్యపై స్పష్టత రానుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ఫలితం 17వ తేదీ రాత్రి పదిగంటలకు రావచ్చని భావిస్తున్నాం. మర్నాడు అంటే 18వ తేదీ ఉదయం 6గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చు. గెలుపు కోటా ఓట్లు నిర్ణయించాక అవసరమైతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతాం. నాలుగు షిఫ్టులుగా విభజించి సిబ్బందిని కూడా షిఫ్టు వైజ్గా నియామకం చేస్తున్నాం. ఇటు పోలింగ్, అటు కౌంటింగ్ను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంంగా ఉన్నాం.