అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం
పంచాయతీ ట్రాక్టర్తో నిత్యం చెత్త సేకరణ
మురుగు కాల్వలు, సీసీ రోడ్లు,వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు నిర్మాణాలు
సుమారు రూ.50.68 లక్షలతో అభివృద్ధి పనులు
పెద్దేముల్, మార్చి 12 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో మారేపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నెలనెలా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేపడుతున్నారు. గతంలో సమస్యలతో సతమతమయ్యే మారేపల్లి గ్రామం.. ప్రస్తుతం సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నది. రూ.50 లక్షల 68 వేలతో జిల్లా పరిషత్ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్, గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పనులు చకచకా సాగుతున్నాయి. పల్లెల అభివృద్ధి కోసం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి జడ్పీ నిధులను మంజూరు చేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
మారేపల్లిలో అభివృద్ధి పనులు..
‘పల్లె ప్రగతి’తో మారేపల్లి గ్రామంలో సమస్యలు సమసిపోయాయి. సుమారు రూ.50.68 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టగా, కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రామంలో రూ.6 లక్షల 20 వేలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రూ. 5 లక్షలతో నూతన బస్షెల్టర్ను నిర్మించారు. సుమారు రూ.5 లక్షల జడ్పీ నిధులతో గ్రామ పానాది మీదుగా ఫార్మేషన్ రోడ్డు, రూ.9 లక్షల జడ్పీ నిధులతో బీసీ కాలనీలో పలు సీసీ రోడ్లను నిర్మించారు. రూ.లక్ష వ్యయంతో రెండు మినీ ట్యాంక్లు మంజూరు కాగా, అందులో రూ.50 వేలతో ఒక నీటి ట్యాంకు నిర్మించారు. సుమారు రూ.5 లక్షలతో ముస్లిం శ్మశానవాటికకు ప్రహారీ నిర్మించడంతో ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షా 70 వేల జీపీ నిధులతో బీసీ, ఎస్సీ కాలనీల్లో మురుగు కాల్వలను నిర్మించడంతో రోడ్ల వెంట మురుగునీరు పారే ఇబ్బంది తప్పింది. రూ.లక్ష జీపీ నిధులతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డును నిర్మించారు. రూ.5 లక్షల జీపీ నిధులతో మురుగు కాల్వల మరమ్మతు చేశారు. రూ.50 వేల జీపీ నిధులతో బీసీ కాలనీలో నూతన బోర్ మోటర్ ఏర్పాటు చేశారు. రూ.లక్షతో గ్రామం నుంచి ఫార్మేషన్ రోడ్డును నిర్మించారు. మారేపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మారిన గ్రామ రూపురేఖలు..
‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో మారేపల్లి గ్రామ రూపురేఖలు మారాయి. గ్రామంలో రూ.2 లక్షల 30 వేలతో కంపొస్ట్ షెడ్డు, సుమారు రూ.12 లక్షలతో వైకుంఠధామం, సుమారు రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. పల్లె ప్రకృతి వనం గ్రామానికి కొత్తందాన్ని తెచ్చింది. నాటిన మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. డంపింగ్యార్డును నిర్మించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. వన నర్సరీలో 11 వేల వివిధ రకాల మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లను వేయించాం. బోరు మోటర్ను ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించాం. జడ్పీ నిధులతో నూతన బస్ షెల్టర్, సీసీ రోడ్లను వేశాం. రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్డు వేయించాం. మినీ ట్యాంక్, ముస్లిం శ్మశానవాటికకు ప్రహరీని నిర్మించాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం.