గద్వాల, మే 25 : పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ప్రవేశపెట్టిందని దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన గోవర్ధన్ మెరుగైన వైద్య సాయం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్షా50వేల ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు శనివారం ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, నాయకులు భాస్కర్, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.