దళితకథకు వస్తువు, శిల్పం, శైలి అన్నీ జీవితమే. దళిత కథకు స్వీయానుభవమే మూలం.
నిజ జీవితంలోని కనపడని అనేక కోణాలను, వాస్తవ చిత్రణలను దళిత కథలు చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2020లో తెలుగు సాహిత్యంలో ప్రారంభమైన దళిత కథా వార్షిక ‘తొండం బొక్కెన’. జంబూ సాహితీ ద్వారా తెస్తున్న ఈ వార్షిక రెండవది. ఈ వార్షికనే ‘చిందూ నేల’.
‘చిందూ నేల’ సత్యానికి ధర్మానికి సమాదరణ కల్పించిన నేల. కాల్పానికం కాదు వాస్తవికమైన నేల. జ్ఞానం రాశులుగా పోసిన వాసి కలిగిన జాగ. ప్రజాస్వామిక ధరిత్రి. ప్రతి తలకాయను లెక్కించిన గణరాజ్యం. ఆత్మగౌరవం అందించిన అవని. అది జంబుద్వీప నేలా. సింధూ నాగరికతగా సిండస్గా, ఇండియా పిలువబడుతున్న ఈ భూమిని స్మరించడానికి ఈ పేరే సముచితమని భావించడం వల్లే ‘చిందూనేల’ గా రెండవ వార్షిక వస్తున్నది.
ఈ సంవత్సరంలో దళిత కథలు చాలా ప్రచురితమయ్యాయి. ఒక్కో కథ ఒక్కో వైవిధ్యాన్ని కలిగి ఉంది. వివిధ కోణాలను, బతుకుల్ని బాధల్ని ఆవిష్కరిస్తుంది. వినూత్నంగా వివరిస్తున్నది. వాటిలోంచి కొన్ని కథలు ‘చిందూ నేల’ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. ఇందులో పదహారు కథలు పదహారణాల నిండుదనానికి ప్రతీక. పాఠకుని అభీష్టాన్ని అనుసరించి కథ అర్థమవుతుంది.
ఈ కథలలో బతుకు పదను, పదునూ ఉన్నది. వలపోతలు, పురికొల్పులు, మేలుకొలుపులు, ఓదార్పులు, తిరుగుబాట్లు ఉన్నాయి. కదిలే కాలమ్మీద పచ్చి నిజాలు చిత్రిక పట్టాయి.అంతరంగాలను, అంతరాలను ఆవిష్కరించాయి.
ప్రేమ ఆరోగ్యానికి హానికరం (లవ్ ఈజ్ ఇంజ్యూరిస్ టు హెల్త్.) అనీ ప్రేమ జగత్తుకు ఒక కొత్త నిర్వచనమిచ్చిన సతీష్ చందర్ కథ ‘నిద్ర గన్నేరు’. రాజమండ్రి సమీప గోదావరి తీరంలోని నిద్ర గన్నేరు చెట్టు ఎంతో మంది ప్రేమ పక్షుల జ్ఞాపకం. అలాంటిదే గ్లాడిస్ విభాత వర్మ ప్రేమకథ.
తెలంగాణ పల్లెల్లో భూస్వాముల ఆగడాలకు అడ్డూ అదుపులేదు. మాటలకందని మాల మాదిగ ఆడోల్ల గోసలు ఒక్కటికాదు. భర్త పక్కలోంచి భార్యను తీసుకెళ్లిన దుర్మార్గాలను, కుక్కలు చింపిన విస్తరిలా మారిన ఆడోల్ల బతుకుల్ని జూపాక సుభద్ర తన ‘పగిలిన పచ్చిపుండ్లు’ కథ ద్వారా వెనుకటి ఎతలను ఏతం బొక్కెన తీరు ఎత్తిపోసింది.
ఇన్ని హాస్పిటళ్లు కట్టించామనీ, వివి ధ స్కీమ్ల కింద అందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని ప్రకటించే కేంద్రం డొల్లతనాన్ని బయలుపరిచిన భూతం ముత్యాలు కథ ‘బతుకు నడక’. బహుజన కులాలది వృత్తి సంబంధం. ఉత్పత్తి అనుబంధం. వృత్తి సుట్టిర్కమని విస్తృతార్థం కల్పించిన బహుజన తాత్వి కతతో ఉమ్మడి శత్రువుని ఎప్పటికైనా ఎదుర్కోవాల ని చెప్పే జిలుకర శ్రీనివాస్ కథ- ‘నర్స య్య ధ్యానం’.
డిమాండ్ సూత్రానికి కొన్ని పరిమితులుంటాయి. అలాంటి పరిమితులలో కులాన్ని చేర్చాలని కొత్త నిర్వచనం చెప్పిన వాస్తవం ‘త్రీ కమాండ్మెంట్స్’. కులవైరస్ ఎప్పటికప్పుడు పరిణామం చెందుతుందనీ చెప్పే చరణ్ పరిమి కథ ఇది. రాజ్యాంగం అమలవుతున్న ఆధునిక కాలంలో అత్యాధునికంగా తరుముతున్నారో, పూర్వ కాలంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు అభివృద్ధి కాగానే చట్టబద్ధంగా ఎలా తరిమేస్తారో తెలియజేస్తుందీ కథ.
ఏనుగు నెత్తిన ఏనుగే మన్నేసుకున్నట్టు మనం చేసేది మనకే సుట్టుకుంటుందని వ్యవసాయ నష్టాన్ని ఎట్లా అధిగమించాలో తెలియజేసే ఎండపల్లి భారతి కథ ‘ఎలకల రావిడి’. నమ్ముకున్న వృత్తి కడుపులను నింపనప్పుడు ఎంత అభిమానమున్నా ఎవరు కొనసాగుతారు? యాంత్రీకరణ వల్ల నోటికాడి బుక్క ఎత్తకొట్టిన విధానాన్ని, తినవోతే తిండికి లేని పరిస్థితిని తెలిపిన సిస్టర్ అనసూయ కథ ‘కుంగిన పొద్దు’.
చదువుకునేటప్పుడు పాఠశాలలో ఏర్పడ్డ గురుతులు, అనుబంధాలు, ఆత్మీయతలు ఉంటాయని తెలియజెప్పే పెద్దన్న కథ ‘బూబమ్మ కుటుంబం మల్లెపూల పందిరి.’ బహుజనులకు, మైనార్టీలకు ఉన్న మమతానుబంధాల్ని వివరిస్తుంది.
మనిషినే కాదు ప్రకృతిని, అభివృద్ధి పేర పట్టణాలు, పల్లెలను స్వార్థ్ధపు మనిషి ఎలా ధ్వంసం చేస్తున్నాడో తెలిపేది కె.పి. లక్ష్మి నరసింహ కథ ‘మా ఊరికి దొరొచ్చిండు’. తన తల్లి కోరికపై పవన్ అమ్మమ్మ ఊరికి వెళతాడు. అతన్ని పల్లె ఆత్మీయతలు, బంధాలు అల్లుకుంటాయి. పచ్చని పల్లెలో ప్రకృతి ధ్వంసమవుతుంటే చలించి పోతాడు.
ప్రాణం పో యాకే మనిషి విలువ అర్థమవుతుంది. బతికి ఉన్నప్పటి వారి జ్ఞాపకాలు, ఆశయాలు, ఆలోచనలు నెమరేసుకుంటూ నాన్న సమాధి దగ్గర తలుచుకుంటూ పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేసే మేడి చైతన్య కథ ‘సమాధి తోట”
సంతు మంచి బాలుడని శత్రువులతోనే ఒప్పిస్తాడు కథకుడు. నక్సలైట్ అనే ముద్రతో అరెస్టు కాకుండా తప్పించుకుంటూ పోతాడు. చెరువు కట్టవద్దకు పోగానే పిడికె సేతుల పట్టుకొని ఈ బాం బు వెయ్యిమంటరా? అని బెదిరించి తప్పించుకుంటాడు. ఉపాయముంటే అపాయం నుంచి ఎలా తప్పించుకోవచ్చునో తెలుపుతుంది ఉప్పులేటి సదయ్య కథ ‘పిడికె’. లక్ష్యం చిన్నదే అయినా ఆ కోరిక తీరటానికి దాదాపు ఒక తరం వేచి చూస్తారని తెలిపే ఇండస్ మార్టిన్ కథ ‘కరేపాకు’. గృహ ప్రవేశం నాడు తన అమ్మా నాన్నలతో ఇంటెనుకాల కరేపాకు చెట్టు నాటడంతో ఒక జీవిత లక్ష్యం నెరవేరుతుంది.
సమాజాన్ని చదువు ద్వారానే మార్చాలనే కలలతో ఉపాధ్యాయుడిగా మారిన నవీన్ తాను నిర్మించుకున్న మానవ సంబంధాల వల్ల, అనివార్య పరిస్థితుల ప్రభావంతో కాలం వెంట పరిగెత్తాల్సి రావడం, వాక్సిన్ తీసుకునే అవకాశం లేకపోవడం వలన కరోనా బారిన పడి చనిపోవడం బాధాకరమని కెంగార మోహన్ ‘విషనాగు’ కథ వివరిస్తుంది.నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అందరి మధ్య అంతరాలు, ఉపకులాలనూ కనికరించని దుస్థితిని నిజ జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా రాసిన తప్పెట ఓదయ్య కథ ‘మీరేంటోళ్లు సార్”. కింది కులాల్లో అనైక్యత, అంతరాలను వివరిస్తుంది.
పల్లెల్లో బహుజనుల మధ్య ఉన్న ఆత్మీయతను పట్టి చూపుతుంది డా. సిద్దెంకి యాదగిరి కథ ‘బెస్త నర్సయ్య మామ”.
దళితుల ప్రేమ వైవిధ్యంగా ఉంటుందనీ తెలిపే మొదటి కథతో మొదలై అనేక కోణాలలో దళిత జీవితాన్ని రచయితలు ఆవిష్కరించారు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో దళిత పార్శ్వాన్ని స్పృశించారు. స్పృశించాల్సిన కో ణాలు అనేకం ఉన్నాయి. దళిత జీవితాలను ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా వ్యక్తీకరించే కథా రచయితలు కలాలకు పదును పెట్టాల్సిన అవసరమూ ఉన్నది.
-జంబూ సాహితీ