ఆమె కథలు మట్టి మనుషుల జీవన వెతలు. ఆమె ముచ్చట్లు తెలంగాణ జాతి గుండె చప్పుళ్ళు. ఆమె ఉపన్యాసం మాండలిక భాషకు పట్టాభిషేకం. ఆమె వ్యక్తిత్వం సమున్నత మానవత్వం. మొత్తంగా ఆమె తెలంగాణ దర్వాజ మీద సాహిత్యపు చందమామ. ఆమే.. పాకాల యశోదారెడ్డి. స్త్రీ పదానికి 220 పర్యాయ పదాలున్నాయంటారు. అలాంటి పదాలన్ని కలిపితే ఒక్క ఆమె. తెలంగాణ భాషకు బోషాణం పెట్టె, నడిచే నిఘంటువు. అచ్చమైన తెలంగాణ భాషలో కథాశిల్పాలు చెక్కిన తొలి తెలంగాణ రచయిత్రి, పాలమూరు బిడ్డ పాకాల యశోదారెడి (8 ఆగస్టు 1929- 7 అక్టోబరు 2007)
‘పతియు భరియింపు కావున భర్త అయ్యే భామ భరియింపబడును గావున భార్య అయ్యే
పరగనె్యు మలయందు విడ్వడియే విల్లులోన ఎల్లకాలము భరియింతు గాన’
అంటూ.. (‘భారతంలో స్త్రీ’ అన్న పరిశోధనా గ్రంథంలో) ఎప్పుడో దీర్ఘతముని అనే పుట్టుగుడ్డు భర్త గురించి ప్రద్వేషిణి పలికిన పలుకుల్ని నవతరానికి అందించిన ధైర్యవంతురాలు పాకాల యశోదారెడ్డి. అంతవరకూ స్త్రీ పాత్రల్ని పాతివ్రత్యం పరంగానే విశ్లేషించేవారు. దానికి భిన్నంగా యశోదారెడ్డి స్త్రీ ఉనికిని చెప్పారు. సంపాదన లేకుండా తిని కూర్చుని తన మీద ఆధిపత్యం చేస్తున్న భర్తను ఉద్దేశించి…‘నువ్వు సంపాదించి నన్ను భరిస్తే నువ్వు భర్తవు- నువ్వు తిని కూర్చుంటూ పైగా ఆధిపత్యం చలాయించాలని చూస్తుంటే ను వ్వు నాకు భర్త ఎలా అవుతావు’ అంటూ ప్రశ్నించిందని, ఆధునిక దృక్కోణంలో విశ్లేషించిందని పాకాల యశోదారెడ్డి గురించి విమర్శకులు పేర్కొంటారు.
తెలంగాణ తొలితరం సాహితీవేత్తల్లో ఎక్కువగా విన్పించే పేరు పాకాల యశోదారెడ్డిది. స్త్రీ స్వేచ్ఛ, హక్కుల పట్ల ఆవిడకు ఎంతో ప్రేమ, నిబద్ధత వుంది. పాశ్చాత్య, ప్రాచ్య, ఆధునిక సాహిత్యాల పట్ల ఎంతో అభినివేశం వున్న యశోదారెడ్డి స్త్రీల స్థితిగతుల పట్ల ఎంతో ఆవేదన చెందారు. మారుతున్న సమాజంలో స్త్రీ గురించి ప్రస్తావిస్తూ ‘స్త్రీకి సమాన హక్కులు ఉండాలని స్త్రీల సమస్యల కోసం కృషి చేయాలని’ పిలుపునిచ్చారు.
చిన్న వయసులోనే వివాహం తర్వాత హైదరాబాద్కు చేరిన యశోద.. నగర జీవిత జ్ఞాపకాలకన్నా పల్లె జీవనం మీదనే జీవితాంతం ప్రేమను చూపించారు. అచ్చమైన తెలంగాణ గ్రామీణ జీవితాలను కథలుగా చెక్కారు. ప్రతికథలో కల్పన కన్నా, వాస్తవం ఉం టుంది. ఇది మన కథనో, మన పక్కింటి కథనో అన్పించేలా కథన శిల్పం చెక్కుతారు. తెలంగాణ మాండలిక మాధుర్యం చవిచూడాలంటే పాకాల యశోదారెడ్డి రాసిన కథలు చదివి తీరాల్సిందే.
‘నేను రాన్రా తమ్ముడు! అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కతనో? ఈ వానలకూ వొరద లకు ఏర్లు పొంగంగ అది ఎన్ని కయ్యలు గొట్టిందో? ఎన్ని గండ్లు వడ్డదో? కూసుంటే నడుములిర్గె, నడిస్తె కాళ్ళు బెణికెనంట వొర్రెలల్ల వొంపులల్ల వడి ఆ బాట పొంటి వడినడ్వ నాశాతగాదు తండ్రి’ అంట ఎంత జెప్పినగని వాని సెవ్వు మీద పేను వార్తెనా? నా మాట యింటెనా? వాని పట్టు ఇడిస్తెనా..?’ (‘కొత్తబాట’ కథలోని మాటలు)
1929 ఆగస్టు 8న మహబూబ్నగర్ జిల్లాలోని బిజినేపల్లిలో జన్మించారు యశోదారెడ్డి. సరస్వత మ్మ, కాశిరెడ్డి తల్లిదండ్రులు. ప్రాథమిక విద్య అనంతరం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని అన్నారం వాస్తవ్యుడైన చిత్రకారుడు పి.తిరుమలరెడ్డి తో వివాహమైంది. ఆయనే పి.టి.రెడ్డిగా జగద్విఖ్యాతులు.అలా గీతతో రాతకు పరిణయమైందన్న మాట.
ఆమె ఆలోచనల్లో ఆధునికత. పరిశోధనలో ప్రాచీనత కన్పిస్తాయి. హరివంశాల మీద పరిశోధన చేశారు. ఎర్రాప్రగడ, సంస్కృత, నాచన సోమనాథుడి, భైరవకవి.. ఇలా అన్నింటిని పరిశోధించి ఒక తులనాత్మక పరిశీలనతో సిద్ధాంత గ్రంథాన్ని హరివంశాలమీద వెలుగులోకి తెచ్చారు. ‘ఆంధ్ర సాహిత్య వికాసం’, ‘కావ్యానుశీలనము’, ‘ప్రబంధ వాఙ్మయము’, ‘శతక వాఙ్మయము’.. ఇలా దాదాపు 30 పుస్తకాలను వెలువరించారు. ఆకాశవాణి, దక్కన్ రేడియోలో తెలంగాణ మాండలికంలో ఎన్నో ప్రసంగాలు చేసిన తొలితరం కథకురాలు ఆమె. ఆవిడ ప్రతి ప్రసంగంలో తెలంగాణ పదాల నిధులుంటాయి. ఆ యాస, భాషలో జీవనోత్సాహం పొంగుతుంటుంది. ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ అంటూ రేడియోలో ధారావాహికగా ప్రసంగించారు. అవే తర్వాత ‘ఊరి ముచ్చట్లు’ కథలుగా ఖ్యాతిగాంచాయి. ‘అసలైన తెలుగు భాషను ఆస్వాదించాలంటే.. తెలంగాణ తెలుగును వినండి. అనాగరిక భాష అంటూ వినకుండా హేళన చేయకండి’అని యశోదారెడ్డి తెగేసి చెప్పారు. ‘మా పంతులు’ కథలో ‘తెలుగు మాట అచ్చపు మాట, మురిపాల మూట, మల్లెపూల తోట, సింగారాల గురిగి, ఒంపుసొంపుల ఊట’ అని మనతో కూడా అనిపిస్తారు.
రచనను ఒక సామాజిక బాధ్యతగా ఎంచి సాహిత్యాన్ని సృష్టించారు యశోదారెడ్డి. ముఖ్యంగా తన ఊరిలో తనను ‘ఎచ్చమ్మ’ అని పిలిచేవారు కావడంతో.. ఆమె ప్రేమతో రాసిన ‘ఎచ్చమ్మ కథలు’ పాకాల యశోదారెడ్డి గారికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి.
70 ఏండ్ల క్రితమే తన కలం నిండా మాండలికపు సిరాను నింపుకొని తెలంగాణ పల్లె పదాలను కథలుగా చెప్పిన భాషా పరిరక్షకురాలైన ‘ఎచ్చమ్మ’ ఆమె. పాకాల యశోదారెడ్డి రాసిన ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర వికాసం’ పరిశోధనా గ్రంథాల్లో పేరెన్నిక గలది. ఆంధ్ర సాహిత్యం ఎలా పరిణామక్రమం చెందిందో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ‘పారిజాతాపహరణ పర్యాలోచనం’ గురించి చెప్పుకోవాలి. నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణ ప్రబంధాన్ని విశ్లేషిస్తూ పాకాలగారు రాసిన విశ్లేషణ చదివి తీరాలి.
‘మావూరి ముచ్చట్లు’, ‘ఎచ్చమ్మ కథలు’ పాలమూరు జిల్లా మాండలికంలో రాస్తే, ‘ధర్మశాల’ కథా సంపుటి వ్యవహారిక తెలుగు భాషలో రాశారు. ‘మావూరి ముచ్చట్లు’లో తెలంగాణ గ్రామీణ జీవన విధానం కనిపిస్తే, ‘ఎచ్చమ్మ కథ’ల్లో తెలంగాణ సంస్కృతి, భాష, పరిణామం కన్పిస్తాయి. ‘ధర్మశాల’ కాలానుగుణంగా వచ్చిన మార్పులను తేటతెల్లం చేస్తుంది.
యశోదారెడ్డి కథలు తెలంగాణ భాషకు నుడికారపు సొంపులను, ఆ కాలపు మనుష్యుల తీరుతెన్నులను, కాలానుగుణంగా వచ్చిన మార్పులను తెలియజేశాయి. బహుముఖ ప్రజ్ఞతో తన సాహితీ జీవితాన్ని గడిపిన యశోదమ్మ తెలంగాణ యాసకు, తెలుగు భాషకు తన నుడికారాలతో సొంపును కలిగిస్తూ, 3 తరాల సామాజిక ప్రవాహాన్ని ఔపోసన పట్టి సాహిత్య పుష్పాభిషేకాలు చేసిన గొప్ప మానవీయ రచయిత్రి.
–ఐనంపూడి శ్రీలక్ష్మి, 99899 28562