జీవితమనేది ఒక అద్భుతమైన గాథ. ఈ గాథలోని పాత్ర కలలు కనాలి. కలలు కూడా కననివ్వని, కన్న కలలను దోచుకొని అణగదొక్కే ఒకానొక సమాజం ఉన్నంతవరకూ మహిళాలోకం అభివృద్ధి దిశలో పయనించలేదు. ఈ కుట్రలను ఛేదించాలంటే, బీ వైజ్, బీ బ్రేవ్, బీ ట్రిక్కీ అనేలా ఉండాలి. ఈ సత్యాన్ని గ్రహించి కొత్త అడుగులు వేస్తేనే స్త్రీ సమాజం మనగలుగుతుంది. ఇదే ప్రయత్నం చేస్తున్నది ప్రస్తుత స్త్రీ సమాజం అని చెప్పేదే ‘సంఘటిత’ శక్తి! నేను ఎగురగలనా అనే సందేహం నీకు వచ్చిన మరుక్షణం ఆ పని ఎన్నటికీ చేయలేని స్థితిలో నీవు పడతావు అనే మాటను తరచి చూసుకోవాలి. నువ్వు నడవగలిగినంత, నువ్వు మాట్లాడగలిగినంత, నువ్వు ఎగురగలిగినంత…. ఎగురలేకపోతే చింతించనక్కర లేదు. ఎంత ఎత్తుకు ఎగురగలిగితే అంత. నిజాయితీని తలకెత్తుకున్నవాళ్లు సోపానాలను ఎదురేగుతూ ఎక్కేస్తారు. ఈ సోపానాలు ఏవో తెలిపే కవిత్వమే, కథలే స్త్రీవాద సాహిత్యం.
కౌటుంబిక జీవన వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చే దేశం మనది. స్త్రీ, పురుషులిద్దరూ సమానస్కంధులు. కానీ ఇండ్లల్లోనే ఆడవాళ్లను సమానంగా చూడరు. ఆఫీసులు,కాలేజీలు, రాజకీయాల్లో ఎక్కడై నా అంతే.అందుకే కలాలెత్తాల్సి వచ్చింది. పురుషాధిక్యాన్ని విమర్శిస్తుంది స్త్రీవాదం. పురుష సమాజాన్ని కాదు. ఇది జెండర్డిస్క్రిమినేషన్కు నిరసన అంతే. ‘రెండు కండ్లనుంచి చూపులు సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగు తుంటా యి/ కనిపించినప్పుడల్లా కంపరం పుట్టేలా/ ఒంటి మీద చూపులు చెదల్లా పాకుతుంటాయి’ (చూపులు), జయప్రభ ఎప్పుడో రాసిన ఈ కవితను ఇక్కడ తప్పనిసరి గుర్తు చేసుకోవాలి. స్త్రీవాదం ఎందుకు అవసరం అంటే ఇదిగో ఇందుకు! ఈ పంక్తుల్లోని భావాన్ని విడమరిచి చెప్పకున్నా తెలిసిపోతుంది. అందుకే, ‘ఈ దేశంలోని ఆడవాళ్లకు ఒళ్లంతా ముళ్లుండే రోజు ఎప్పుడొస్తుందా’ అని చూడాల్సి వస్తుందని కరాకండిగా చెప్పారీ కవయిత్రి.
‘అమ్మా/ కాలేజీలో ఎవడో వెంటపడుతూ/ బంగారం అంటూ పిలుస్తున్నాడే/అని చెప్పాలనుంది కానీ భయం/చెబితేనువ్వెందుకు దిక్కులు చూస్తున్నావని/అమ్మ తిడుతుంది.’ (బంగారం) కవిత ఇలా సాగుతుంది. అవకాశం కోసం కాచుక్కూచునే ప్రబుద్ధులున్న లోకం ఇది! విషపాత్కులుంటారు. పసిగట్టాలి,తరిమికొట్టాలి. ఇవే ఆడపిల్లలకు చెప్పాల్సిన పాఠాలు.
‘నీ ఇంటికి వెలుపల దీపమయ్యే/ ఆమె మనసే మిటో గుర్తించని అహంతో/ ఓ భ్రమలో ఉన్నావు / నీ మనోదర్పణం లోంచి చూడు/ మనకు మనమే ఆయుధాలం’(చీకటి దీపస్తంభం) అమ్మనైనా, భార్య నైనా మనసుతో చూడాలి కదా. ఇదీ కవయిత్రి భావన! ఇక మరో కవిత ‘ఆకాశంలో సగమంటే నమ్మి / అధికారపీఠాల వాటాల వెతుకులాటలో/ అనివార్యంగా తప్పిపోతూనే ఉన్నాను’ (తప్పిపోయాను) కవిత సమకాలీన పరిస్థితులకు అద్దం పడ్తున్నది.
ఏ దేశచరిత్ర చూసినా ఆడవాళ్లే ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది. మన దేశంలో సంప్రదాయాల, ఆచారాల పేరు చెప్పి ఆడవాళ్లను అణగదొక్కుతున్న వైనాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.ఏ కులం తీసుకోండి, ఏ మతం తీసుకోండి. ఆడవాళ్ళ పరిస్థితి అంతా ఒకే తీరు. ఇక సామాజిక కోణంతో చూస్తే అంతులేని విషాదమే స్త్రీల జీవితంలో !
‘రోజ్దార్లందరి మత్తును విడగొడ్తాయి / ఆమె చేతులు / ఫజర్ నమాజ్ తరువాత / సేద తీరుతారు / ఆమె తప్ప / బేర్దార్ల కోసం మళ్లీ కదం తొక్కుతాయి ఆమె చేతులు’ (నిరామయ సైరన్ ఆమె) ఎంతటి ఆవేదన ఉన్నదీ కవితలో! ఆడవాళ్ల నెలసరి బహిష్టు ఎంతో అవస్థను తెచ్చి పెడ్తుంది. అయినా ఏ పనులూ ఆగవు. అందుకే ఓ కవిత ఇలా ప్రశ్నల నుంచి సలహా కూడా అవుతుంది. ‘అప్పుడప్పుడు అరిస్తే అర్థం చేసుకో/ ఎప్పుడైనా గోల చేస్తే / కాస్త గోప్యంగా ఉంచు/ ఒక్కసారి ఆమె నిశ్శబ్దపు ఘోషను విను’ (శ్వేత రుధిరం) కవిత్వం కనువిప్పును కలిగించాలి.
ఈ సంఘటిత సంకలనం ప్రతి వాక్యం
ప్రతిభావం కోట్ల కోట్ల సత్యాల్ని మోసుకొచ్చింది. ఇందులోని కవితా శీర్షికలే కవితామయంగా ఉన్నాయి. మచ్చుకు ‘సాధారణ గృహిణి కాదా సర్వోన్నత శక్తి’, ‘నడుస్తున్న చరిత్ర’, ‘అలసిన మనసు’, ‘గాయాలగని’, ‘మోకరిల్లిన సింహం’, ‘చైతన్యానికి రెక్కలు మొలవాలి’, ‘మాక్క ముక్కుపుల్ల గీన్నే పోయింది’, ‘ఆగామి కాలం ఆమెదే’, ‘దగాపడ్డ పూవు’, ‘ఆమె గొంతుకనై’, ‘నేనెట్లా అపవిత్రనౌతా’, ‘కొలిమి బంధం’,‘సమాప్త గీతం’, ‘చిక్కటి రేఖ’, ‘వెంటిలేటర్ జీవితాలు’, ‘ఆమె అచ్చంగా ఆమెకే తెల్సు’, ‘ఆకాశంలో సగం నేను’, ‘సుమబాలలు స్వయం సిద్ధలుగా’ వంటి కవితల పేర్లే ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
ఇక కవిత్వం ఎంత బాగుంటుందో ఆలోచించవచ్చు. ఎన్నిరకాలుగా స్త్రీలు వేదనలకు గురవుతున్నారో ఈ పేర్లే చెప్తాయి. ‘ఆమె గగనంలో విహంగమా’, ‘ఆమె ఇప్పుడో ఫ్యాషన్ ఐకాన్’, ‘వదిలేయాల్సి వచ్చిన ఇల్లు’,‘మనకు మనమే ఆయుధాలం’, ‘అమ్మనై అడుగుతున్నా’,‘మార్నింగ్ సాగా’, ‘ఇప్పుడున్న కర్తవ్యం’, ‘లాక్ డౌన్ అమ్మ’, ‘మగువ అంతర్యుద్ధం’, ‘జగన్నాథ రథచక్రాలు’ ఇలా ఒక్కో శతఘ్ని తప్పుడు ఆలోచన ల్ని చీల్చి చెండాడేలా ఉన్నాయి.
స్త్రీవాదమంటే పురుషద్వేషం కాదు, మగువ మనసు వేదనలు, జీవిత విషాదాలు అంతే! పురుషులు ఉన్నతులు, స్త్రీలు అల్పులు అని చూసేవాళ్ల కోసమే ఈ కవిత్వం. ‘వందల మగాళ్ళ మధ్య తిరిగొచ్చిందానివి / అన్నమాటకు చెత్తలో చేరిన పాత టికెట్లా / నాకు నేనే కృశించి పోతా’ (లేడీ కండక్టర్) అనే కవిత కదిలిస్తుంది. పురుషులు ఎక్కడినుంచి వచ్చారు? స్త్రీలు కంటేనే కదా!
‘అమ్మకడుపులో/ ఉమ్మనీటిలో / రక్షణ లేని హత్యల్లో/ బతికి మిగలడమే అగ్నిపరీక్ష’ (ప్రసవమెప్పుడో) అంటూ ఓ కవయిత్రి భ్రూణహత్యలపై రాసినా, ‘గర్భసంచిలో భూగోళాన్ని మోస్తూ/ జన్మనిచ్చిన ప్రతి జీవికీ / క్షీరధారలు పంచుతూ/ చలనం లేని ధరిత్రిలా/ ఆమె/ అక్కడే ఉంటుంది’ (చిత్రం) అంటూ ఈ సమస్త మానవాళి పుట్టుకకు కారణభూతురాలైన స్త్రీని సకల ప్రాణికోటికి నెలవైన భూమితో పోలుస్తూ రాస్తారో కవయిత్రి.
భర్తను కోల్పోయిన ఒంటరి స్త్రీలను ఎన్ని అవమానాలకు గురి చేస్తుందో ఈ సమాజం! ‘అంతఃపుర కారాగారాలు/ బాధ్యతల పేరిట బందీలం / సంప్రదాయాల కొలిమిలో ఇంధనాలం’ (సిద్ధార్థ). ఒంటరి మహిళలంటే చులకన! వితంతువులంటే విసుగు. అందం గా ఉన్నా కష్టమే, అందంగా లేకు న్నా కష్టమే! ‘దగాపడ్డావు’, ‘నేనెట్లా అపవిత్రురాలినయ్యాను’, ‘జర జాడ చెప్పుండ్రి’,‘అవును మౌనాన్నే మాట్లాడుతున్నా’ వంటి కవితలు స్త్రీల దుస్థితిని వివరిస్తాయి. ‘జీవితం అత్యంత ప్రియమైంది/ దాన్ని నక్షత్రాలతో అలంకరించుకోవాలని చెప్పాం/ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర / గాయపడ్డ జ్ఞాపకాలేమీ లేవు’ (టచ్ మి నాట్) అంటూ అఘాయిత్యం చేయబడ్డ స్త్రీలకు ధైర్యం చెప్పడం చూడవచ్చు. ‘పసి కిరణాలను కాల్చే / సుడిగుండాల్ని/ తెగనరికే/ రుతుగీతాలను నేర్పిస్తాను/ పిశాచ హేలల్ని ఉసిగొల్పే / వాడి ద్వంద్వ వైఖరుల్ని పసిగట్టే నిఘా నేత్రాన్నవుతాను’ (దగ్ధహృది) అంటూ ఎప్పటికప్పుడు దూరదృష్టితో ‘జాగ్రత్త’ అనే నేత్రంతో ఉండాలని చెప్తుందీ కవయిత్రి. ‘ఇక ప్రతి ఆడపిల్లనీ / లేడిపిల్లలా కాక / వేటకత్తిలా పెంచే రోజొస్తుంది/ జాగ్రత్త / మేం కనకపోతే మీరెక్కడ?’ (యుద్ధం మాకు కొత్తకాదు) అంటూ మరో కవయిత్రి ఎలుగెత్తుతుంది.
ఈ సంఘటిత సంకలనానికి ‘ఉరుముతున్న ఆకాశాలు’ అంటూ ముందుమాటగా కొల్లాపురం విమల శక్తివంతమైన వాక్యాలు రాశారు. ‘సంఘటిత యుద్ధ సంసిద్ధత’ అంటూ కాత్యాయనీ విద్మహే వివరణాత్మక వ్యాసం రాశారు. ‘స్త్రీవాదం.. వాదాలేవైనా.. న్యాయం కోసం చేస్తే పోరాటాలే’ అనే శీర్షికతో ఝాన్సీ కేవీ కుమారి రాసిన పీఠిక స్త్రీవాద సాహిత్య ఆవశ్యకతను తెలుపుతుంది. ‘విస్మరణను ఛేదించే ప్రయత్నం’ అంటూ.. స్త్రీవాద కవిత్వాన్ని గుచ్చిన మాల ఇదని ఈ సంకలన కర్త జ్వలిత చెప్పారు. అక్షర సత్యం. అనాదిగా సకల వివక్షలకు గురవుతున్న స్త్రీ జాతికి, వారి తరపున బాధ్యతతో ఐక్యంగా కలాలు పట్టిన 115 మంది కవయిత్రులకు ఈ సంఘటిత అంకితం అని సంపాదకురాలు వినమ్రంగా ప్రకటించడమూ న్యాయసమ్మతంగా ఉన్నది.
తాను నడిచిన నేలపై అడుగుల ఆనవాళ్లను చెరిపేసే శక్తులుంటాయి. అది పసిగట్టాలి. హృదయపేటిక పీఠంపైన కూర్చున్న బాధల తుట్టెను కదిలించడమే స్త్రీవాద కవిత్వం పని. ఈ పని చేసిన కవిత్వాన్నంతా ప్రోది చేసి 300 పేజీల ’సంఘటిత’ కవితా సంకలనాన్ని అందించిన జ్వలితకు అభినందనలు.!