అనువాదాలు: ఈ వర్ణానాత్మక ‘ఋతుసంహారః’ ఖండ కావ్యానికి భారతీయ భాషల్లో పలు అనువాదాలు వచ్చాయి. ఈ కృతి లాటిన్, ఇంగ్లీష్, జర్మన్ మున్నగు యూరోపియన్ భాషల్లోకి అనువాదమైంది. ఈ ‘ఋతుసంహారః’కు నాకు తెలిసీ తెలుగులో 1950 ప్రాంతంలో కవి గొట్టుముక్కల రాధాకృష్ణరావు తేట తెలుగు పద్యాలలో అనువాదం చేశారు. 2003లో ప్రముఖ సంస్కృత పండితులు జీవీఎస్ సుబ్రహ్మణ్యశర్మ ఈ ‘ఋతు సంహారః’కు తెలుగులో గద్య కవితగా అనువాదం చేశారు. అనువాదరంగంలో ఔత్సాహికుడైన ఈ వ్యాసకర్తా వచన కవితా రూపంలోకి అనువదించాడు. సంస్కృత సాహిత్య సంవిధాన రూపకర్తా, నిత్యనూతన కవిత్వ సృష్టికర్తా, కవికుల గురువూ మహాకవి కాళిదాసుకు ప్రణామ సహస్రాలు!!
కవికుల తిలకుడు, సదా కవి యువ రాజైన కాళిదాసు తొలికృతి ‘ఋతుసంహారం’ (ఋతువుల మాల). ఈ లఘు కావ్యంలో ఏ కథా లేదు. ప్రియుడు ప్రేయసికి ఆరు ఋతువుల వర్ణన వినిపించడం ఉంది. దీనిలో రాజు ప్రసక్తి, రాజ్య వైభవాల వర్ణనలు లేకపోవడం వల్ల ఇది కాళిదాసు తొలికృతి అని నిస్సంశయంగా చెప్పవచ్చు.
ఈ కృతి కఠినంగా లేకపోవడంతో మల్లినాథ సూరి దీనికి వ్యాఖ్య రాయలేదంటారు. ఆ తర్వాత చాలా ఏండ్లవరకూ ఎవరూ వ్యాఖ్య రాయలేదు. క్రీ.శ.1814లో మణిరామశర్మ అనే పండితుడు ఈ కృతికి చంద్రిక పేరుతో వ్యాఖ్యను రాశాడు. తెలుగులో మాత్రం 2015లో రావి మోహనరావు అద్భుత వ్యాఖ్యను రాశారు. పాశ్చాత్య సాహిత్య పండితులు ఈ కృతిని భారతీయ సాహిత్య భాండాగారంలో ఒక అపూర్వ కృతిగా తలచారు. ఇందులో ఆ కాలపు ఆర్థికస్థితి, ప్రజా జీవనమూ చక్కగా ప్రతిబింబించాయి.
కాల ఋతుచక్రంలో తొలుత వచ్చేది వసంత ఋతువు. అందుకే ‘ఋతురాజో వసన్తః’ అనీ అంటారు. కానీ తీవ్రమైన ఎండలతో ప్రకృతినీ, ప్రజలనూ మండించే గ్రీష్మఋతువుపై కవికాళిదాసుకు మక్కువ ఎందుకోగానీ.. ‘ప్రచణ్డ సూర్యః స్పృహణీయ చన్ద్రమా.. (ప్రేయసీ! చండ ప్రచండ మార్తాండుడు స్వైరవిహారం చేస్తూ ఉండే చల్లని వెన్నెళ్ళు కురిపించే చంద్రుడి రాక కోసం, జనం ఎంతగానో కోరుకుంటూ ఉంటే, స్నానం చేయడానికి మాత్రమే నీళ్లు దొరుకుతూ ఉండే, ఉల్లాస మనోజ ్ఞసాయంత్రాలతో కామోపశమనం చేసే గ్రీష్మం వచ్చేసింది- ‘మదీయానువాదం’) అంటూ ఈ కృతిరచనను ప్రారంభించాడు.
కాళిదాసు తన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలోని నాందీ ప్రస్తావనలోనూ అనుభవించేందుకు తగినట్టి గ్రీష్మ ఋతువు గురించే నటిని పాడుమని సూత్రధారుడిచే చెప్పిస్తూ ఆ నటితో ‘తలస్నానాలకు చాలా అనుకూలాలై, పాటల పుష్ప సంపర్క పరిమళాల వన వాయువులతో కూడి, చల్లని చెట్ల నీడల్లో సుఖనిద్రను కలిగిస్తూ ఈ గ్రీష్మదినాలు సాయం కాలాల్లో ప్రీతిని కలిగిస్తున్నాయి అనే భావం గల ‘సుభగ సవిలావగా హాః దివసా పరిణామ రమణీయః’ శ్లోకాన్ని పాడిస్తాడు. ఆరు సర్గల ఈ ఖండ కావ్యంలో ఒక్కో సర్గలో ఒక్కో ఋతువును వర్ణించాడు. ఇందులో మొత్తం 144 శ్లోకాలున్నాయి.
ప్రథమ సర్గ- ‘గ్రీష్మ వర్ణనం’లో జనులు- శశాంకుడు వెన్నెలతో తరిమేసిన తమోరాశుల రాత్రులనూ, జలయంత్రాలు గల నివాస సదనాలనూ, చందన సుగంధ ద్రవ్యాలనూ గ్రీష్మంలో తమ తాపహరణానికి వాడుకుంటున్నారనీ, స్త్రీలు సన్నని వస్ర్తాలను పైటగా కప్పుకుంటున్నారని వర్ణిస్తాడు. వన హరిణాలు ఎండకు దాహంతో తపిస్తూ దిగంతాకాశాన్ని చూసి నీళ్లేనని పరుగులు తీస్తున్నాయంటాడు. గ్రీష్మతాపానికి సర్పం నెమలిపింఛం నీడన అలసట తీర్చుకుంటుందనీ, సింహం-చేరువలో ఉన్న ఏనుగులను సంహరించడం లేదనీ అంటూ- నిర్జలమవుతున్న నీటి మడుగులతో అడవి భూములు భయాన్ని పుట్టిస్తున్నాయనీ, దావాగ్ని కీలలతో అరణ్యాలు దగ్ధమైపోయాయనీ వేసవి ప్రతాపాన్ని వర్ణించాడు కాళిదాసు.
ద్వితీయసర్గ- ‘ప్రావృడ్వర్ణనం’ (వర్ష ఋతువర్ణనం)లో కాళిదాసు-మేఘాల మత్తగజాలతో, సౌదామినుల పతాకాలతో, ఉరుములనే మద్దెలలతో వర్షఋతువు రాజువలె రాజసంగా వచ్చిందని వర్ణిస్తాడు. ఈ కాలంలో ధరిత్రి-రత్న మాణిక్యాలతో అలంకృతమై మహా సుందరాంగన వలె భాసిస్తూందంటాడు. ఈ కాలం నవ కుసుమాలతో, అటవి మొల్లమొగ్గలతో, కడిమి పూలతో కర్ణభూషణాలను సంతరిస్తున్నదనీ, ఈ ఋతువు-నీకు హితవు చేకూర్చే నీ కోరికలను మళ్లీ మళ్లీ మరీ మరీ ఫలింపజేయుగాక- అని ఆశిస్తాడు కాళిదాసు.
తృతీయ సర్గ- ‘శరద్వర్ణనం’లో శరదృతువు-దర్భతృణవస్ర్తాన్ని ధరించి, కమల మనోహరముఖంతో, మరాళ రవళుల మంజుల మంజీర నాదాలతో, కొంచెం పండిన వరి పైరుతో సుందర సుకుమారంగా కడు రమణీయమై కొత్త పెండ్లి కూతురు వలె వచ్చిందని వర్ణిస్తాడు. ఈ కాలంలో నదులు చేపల పేటల వొడ్డాణాలతో, తెల్లని పక్షుల పంక్తుల కంఠహారాలతో సమదంగా మందంగా సాగే ప్రమదల వలె ప్రవహిస్తున్నాయని చెప్తాడు. పద్మముఖంతో నల్లకలువల కళ్లతో రెల్లుపూల తెల్లని వస్త్రంతో శరదృతువుల- మత్తకామినీ కాంత వలె అత్యుత్తమ ప్రీతిని కూర్చాలని కోరుకుంటాడు.
చతుర్థ సర్గ- ‘హేమంత వర్ణనం’లో క్రొత్త చిగురుల ఆవిర్భావంతో, సస్యరమల రమ్యతతో, తెల్లని లొద్దుగు చెట్లతో, చిక్కని మంచుతో- మార్గశిర పుష్యమాస సంగమమై చలితో వణికించే హేమంతం వచ్చిందనీ వర్ణిస్తూ, బహు గుణగణాలతో అతిమనోహరమై స్త్రీ జన హృదయాలను దోచుకుంటూ పుష్కలంగా పండిన వరి పంటల పల్లె సీమలు కలదై, ఈ శీత తుషార హేమంతకాలం సౌఖ్యాన్ని ప్రసాదించినదవుగాక- అని ఆశిస్తాడు కవి కాళిదాసు.
పంచమసర్గ- ‘శిశిరవర్ణనం’లో ఓ ఉవిదా! బాగా పెరిగిన వరి వెన్నులతో మనోజ్ఞమైనదైన, ప్రమద జనానికి చాలా చాలా ప్రియమైన శిశిర ఋతువు గురించి చెప్తున్నా వినుమంటాడు. ఇందులో రెక్కలు మూసిన గవాక్షాల నివాసాల గురించీ, నులి వెచ్చదనాల సూర్యుడి కిరణాల గురించి వర్ణిస్తూ- మిక్కిలిగా బహుగుఢ భేదాలు కలిగిన, రుచ్యవరితో, చెరకుతో రమ్య మధురమైన, మదనుడి దర్ప ప్రదర్శన కలిగిన ఈ శిశిర ఋతువు ఎప్పుడూ మీకు శ్రేయస్సును కలిగించేదై ఉండుగాక- అనీ కవి కాళిదాసు కోరుకుంటాడు.
షష్ఠసర్గ- ‘వసంత వర్ణనం’లో ఓ ప్రియురాలా! ఎదిగి పూచిన మామిడి మొలకలే నిశి బాణాలుగా కలిగిన, తుమ్మెదల పంక్తి హారం వింటినారిగా విలసిల్లుతూ ఉండగా మదనుడు నివసించే, జనులను సుఖప్రదమయ్యే వసంతఋతువనే యోధుడు నిరత సురత కామాసక్తుల మనస్సులను వేధించడానికి వచ్చినాడు సుమా! అని చెప్తాడు. ఈ ఋతువులలో పవనాలు పరిమళభరితాలై, ఆహ్లాద మలిసంజ కెంజాయ వేళలతో దిన సమయాలు రమ్యమై సకలం అతి సుందరంగా ఉంటుందంటాడు. ‘ఆమ్రీ మంజుల మంజరీ వరశరః’ (ఎవ్వనికి ఆమ్ర సుమ వల్లరి వరిష్ఠమైన బాణమో, ఎవ్వనికి ఎర్రని మోదుగుపూవు ఉత్తమమైన ధనువో, ఎవ్వనికి తుమ్మెదల కులము మేలైన అల్లెత్రాడో, ఎవ్వనికి మలయ మారుతమే మదగజమో, ఎవ్వనికి కోకిలలు కైవారులో, ఆ జిత స్వభావ మన్మథుడు వసంతునితో కలిసి మీకు శుభాల కూర్చుగాక! ) అనే శ్లోకంతో కాళిదాసు ‘ఋతుసంహారః’ కృతిని సంపూర్ణం చేశాడు.
‘రఘువర్మ’ (టీయల్యన్)
92900 93933