కాకతీయ రుద్రదేవ మహారాజులు (రుద్రమదేవి) పాలనాకాలంలో సావాసి పెద్దిరాజుగారు పాలకవీటను (పాలకవీడు) శ్రీ గోపీనాథ దేవుని ఉభయ పిరాట్ల (దేవరులతో) సహితంగా ప్రతిష్ఠ చేసినాడు. ఆ సమయంలో గొల్లకోట గుండయ ప్రెగ్గడ రుద్రయకు (రుద్రమదేవికి) పుణ్యంగా అమృతపడికి (దేవుని నైవేద్యమునకు) రావికుంట గ్రామాన్ని సమర్పించినాడు.
మల్లెబోయిని బొల్లయ ప్రతాపరుద్రదేవునికి పుణ్యంగా దిరుసము చెరువులో పుట్టెడు పండే భూమి, చెఱుకు వేలూరి బొల్లయరెడ్డి దేవుని అమృత నైవేద్యానికి నల్లచెరువు ఆఱుకట్టలో మర్తురు, పొనుంగోటి దారిలో అమరపురము, గణపవరములలో మర్తురు భూములను సమర్పించినాడు. చెన్నకేశవ పెరుమాళుకు కేశవదేవుడు పెద్దచెరువు వెనుక కొంత భూమిని వ్రిత్తులుగా సమర్పించినాడు.
పాలకువీడు మహాజనాలు మారయ గణపద్దేవునికి పుణ్యంగా మాడబడి అడ్డుగలు (కొలమానం అయి ఉండవచ్చు) ప్రతి మర్తురుకు స్వామి భోగానికి సమర్పించినారు. అదేవిధంగా కాపులు, సమస్త ప్రజలు, ఆయగాండ్రు, పహిండికి (బంగారం) మాడకు మాడబడి వీసం లెక్కన సమర్పించినారు. రాజ పరివారంలో బంటులు మాడకు చిన్నం లెక్కన సమర్పించినారు. మట్టపల్లి మహాజనాలు కాపులు, ఆయగాండ్రు, మాడకు మాడబడి వీసాలు పెట్టినారు.
కాకతీయ సామ్రాజ్యాధినేతల్లో రుద్రమదేవి ఒక విశిష్ట వ్యక్తిగా పేర్కొనబడుతున్నది.
శత్రువులకు భీతిని కలిగించే పాలకురాలిగా ఉంటూనే, ప్రజలను పాలించే విషయంలో అంతే సౌమ్యంగా ఉండేది. అటువంటి రుద్రమదేవికి పుణ్యం కలగాలని రాజ్యంలోని పలు ప్రాంతాల్లో సామంతులు, మంత్రులు, సామాన్య ప్రజలు దేవాలయాలను నిర్మించి, దానధర్మాలు చేసి శాసనాలు వేయించారు. అటువంటి శాసనాల్లో పాలకువీడు శాసనం విశిష్టమైనది. శాసనకాలం శ.సం.1191 = క్రీ.శ. 1269 కార్తిక శుద్ధ పంచమి.
శాసనంలో అంచెల వారీగా స్వామిభక్తి పరాయణత్వం కనిపిస్తుంది. రుద్రమదేవికి పుణ్యంగా సమర్పించినవారు కొందరైతే ఆ ప్రాంత పాలకుడికి సమర్పించినవారు ఊరి ప్రజలు. అంటే స్థానిక పాలకునికి స్థానిక ప్రజలు పుణ్యం కలగాలని కోరుకుంటే, ఆ పాలకుడు తన పై అధికారికి పుణ్యం కలగాలని కోరుకొని దాన ధర్మాదులు నిర్వహించినారు. ఇంకా విశేషమేమంటే గ్రామంలో ఉండే అందరు మహాజనులు, కాపులు, ఆయగాండ్రు, బంటులు అన్ని తరగతుల ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని తన పై అధికారి బాగుండాలనే సంకల్పంతో స్వామిని వేడుకుంటూ దేవుని నైవేద్యానికి సమర్పించడమన్నది అద్భుత అంశం.