జానపద గేయాలను ఆలపిస్తూ భిచ్చుక వృత్తిలో జీవించే గాయకులు మన తరతరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తున్నారు. చారిత్రక కథా గేయాలకు రక్షకులుగా సంఘానికి వీరు గొప్ప మేలు చేస్తున్నారు. ఈ వృత్తుల వారు మొదట భిచ్చకులు కారు. మారుతున్న పరిస్థితుల్లో తమ ప్రధాన వృత్తియైన కళలు, గేయాలాపనలను పొట్టపోసుకోవటానికి వినియోగిస్తున్నారు. వీరి సంతతి ఈ వృత్తిని స్వీకరించలేక ఇతర వృత్తులు చేపట్టడం వలన మన ప్రాచీన కళాసంస్కృతులు నశించిపోయే ప్రమాదమున్నది. వీరికి ఆదరణ కల్పించి మన ప్రాచీన చరిత్రను సంరక్షించుకోవలసిన అవసరమున్నది.
ప్రాచీన కాలంలో రాజులు కళలు, సంస్కృతులకు అధిక ప్రాధాన్యమిచ్చి కళాకారులను ప్రోత్సహించారు. భిచ్చకులను పోషించిన రాజులు కాలగమనంలో గతించిపోయారు. అందమైన జీవితం తమ కనులముందే కుప్పకూలి పోవటంతో వారు జీవిక కోసం కులాలను ఆశ్రయించి ఆశ్రిత కులాలుగా మారారు. చతుర్వర్ణాలలో బ్రాహ్మణులకు- విప్ర వినోదులు, క్షత్రియులకు-భట్లు, వైశ్యులకు- వీరముష్టులు, శూద్రులకు- పిచ్చుకగుంట్లు మున్నగువారు ఆశ్రితులయ్యారు. అటుతర్వాత వారు పాటలు పాడి బిచ్చమెత్తటాన్ని అలవర్చుకొన్నారు. ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులంగా ఏర్పడి వారి కులవంశ చరిత్ర, దేశ, రాజ్యపాలన, వారి వంశరాజుల చరిత్రలు, వీరగాథలను ఆలపిస్తూ చారిత్రక ఇతివృత్తాలకు రక్షకులుగా నిలుస్తున్నారు.
జానపద గేయాలను మౌఖికంగా తరతరాలనుంచి భద్రపరిచిన వారు వీరే. శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, రాజన్నలోల్లు, గొల్లసుద్దులు, గంగిరెద్దు లవారు, బీరన్నలు, బొమ్మలాటగాండ్రు, మందెచ్చులవారు, భాగవతులు, కాటికాపర్లు, సాధనాశూరులు, బుడగజంగం వారు, డక్కలివారు, దొమ్మరి, చిందు మాదుగలు, మాష్టీలు, బవనీలు, జక్కులవారు, చిలుక జోస్యులు, హట్కరులు, కొమ్మువారు, ఒగ్గు కళాకారులు, హరిదాసులు, ఎరుకలు, పూసల బలిజెలు, వీరవిద్యావంతులు వీరందరూ తరతరాల సాంఘిక జీవనాన్ని, చారిత్రకాంశాలను గానం చేస్తారు. వీరు పాటలు పాడుతూనే అభినయం చేస్తూ నయనా నందాన్ని కలిగిస్తారు.
వీరు ఒక చోట ఉండక దేశదిమ్మరులుగా జీవిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరు పూరిగుడిసెలు వేసుకొని ఉన్నా, ప్రధానంగా సంచార జీవితం గడుపుతుంటారు. వీరి సంతతికి చదువు, సందెలు లేవు. వంశపారంపర్యంగా వచ్చిన వృత్తిని చేపట్టి కళా ప్రదర్శన, గేయాలాపన నేర్చుకొని పొట్ట పోసుకుంటున్నారు. ఏటా వానాకాలంలో తమ గుడారాలకు చేరుకొని జీవిస్తున్నారు. మిగతా కాలాలలో దేశాటన చేస్తుంటారు. వీరు తలదాచుకొనే ఇండ్లు, వారి సంసార జీవితం, చిన్నపాటి సంపద.. ఇదంతా సంచార జీవితానికి అనుగుణంగానే ఉంటుంది. రెండు కట్టెలు, రెండు చాపలు కలిపి గుడారం నిర్మించుకుంటారు. వారి ఆస్తి అంతా కూటికొక కుండ, పులుసుకొక చిప్ప, తాగడానికి ముంతలు, వెంట విశ్వాసంగల రెండు కుక్క లు, పాడేటప్పుడు ఉపయోగించే వాయిద్యాలుంటాయి. అలాగే వారి సంపదలో రెండు పందులు, నాలుగు కోళ్లు, గాడిదలు ఇవే వారి వాహన, పశు సంపద. వారు ఒక చోటు నుంచి మరోచోటుకు పోయేటప్పుడు వారి సంపదంతా వారి కావడిపైనో, గాడిదపైనో వేసుకొని తరలిపోతారు. వారికి తీరని కోరికలు, తీర్చవలసిన సమస్యలుండవు. ఆ పూట తప్ప తెల్లవారి ఏమిటనే ఆలోచన ఉండదు. ఏదైనా అనారోగ్యం వస్తే.. వనమూలికలు, జీడిగింజలు, శొంఠికొమ్ము, ఆకు పసర్లతోనే వైద్యం చేసుకుంటారు.
వారి మధ్య మానవ సంబంధాల్లో వైషమ్యాలు, కలహాలు, కొట్లాటలు తలెత్తినప్పుడు కులపెద్దలు, కులపంచాయితీలతోనే పరిష్కరించుకుంటారు. వీరి వైవిధ్యపూరితమైన జీవితంలో.. కలహం ఎంతోసేపు ఉండదు. కులపెద్దల జోక్యంతో వెంటనే సమసిపోతుంది. సామూహిక సహజీవనం కొనసాగిస్తారు. వీరు తమ కళలు ప్రదర్శించే సమయంలో ప్రత్యేక వేషధారణతో కళాప్రదర్శనలు చేస్తారు. ప్రధాన కథకుడు, వంతకులు కాళ్లకు గజ్జెలు కట్టుకొని, చేతిలో వాయిద్యాలు వాయిస్తూ ప్రదర్శనలిస్తారు. ప్రధాన కథకుడు చేతిలో బుర్రతోనో, గుమ్మడికాయ బుర్రతో చేసిన తంబూరనో వాయిస్తూ కథ చెబుతాడు. అందుకే ఈ కథలను బుర్రకథలంటారు. వీరు ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పల్నాటి ప్రాంతాలలో గానం చేస్తారు. తెలంగాణలో ఒగ్గు కథ, బుర్ర కథ ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. జంగం కథ కోస్తా జిల్లాల్లో ప్రచారం పొందింది. గురువు లింగము, జంగము.. ఇందులో జంగము అంటే తోడి వీరశైవుడు. ఇది కులానికి సూచిక కాకుండా, భక్తి సమూహానికి చెందినదిగా కనిపిస్తున్నది. పాల్కురికి సోమన కాలం నాటికే ఇది ప్రచారంలో ఉన్నది.
‘మెల్లని నడపులు మృదు భాషణములు వల్ల భత్యములు చిత్తోల్లాసములను భక్తి శృంగారముల్ ప్రభుశక్తులును, వి రక్తి భావములు నారాధ్య సంపదలు…
బూని యెంతయు జగత్పూజ్యతదనర నభిరమ్యలీల దుల్కాడుగ నిట్టు లుభయ జంగమ కోటులొక్కట’అంటూ… మిండ జంగాల వర్ణనను పాల్కురికి సోమన సహజసిద్ధంగా వర్ణించాడు.
ఊరుకు ఒక కుల ఆశ్రితులుగా వచ్చే భిచ్చకులు వంతుల వారీగా రోజుకొక ఇంటికి వెళ్లి విందు ఆరగిస్తారు. ఊరు జనం రాత్రి వేళ అన్నం తిన్న తర్వాత వీరు కుల, వంశ చరిత్ర చెప్పడం ప్రారంభించి తెల్లారే దాకా ఏక బిగిన ఏడెనిమిది గంటలు కథ చెప్తారు. వారు చెప్పే గాథను ఊరి జనమంతా ఒక్కదగ్గర పోగై ఆసక్తిగా, భక్తి పూర్వకంగా వింటారు. భిచ్చకులను ఆయా కులాల వారు తమ కులపెద్దలుగా ఆరాధిస్తారు. తమదైన కుల, గోత్రాల చరిత్రను వారితో చెప్పించుకొని తమ కుల వైభవాన్ని తెలుసుకొంటారు. సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను వారి తో విని ఆచరిస్తారు.
భిచ్చుక గాయకులు రాగయుక్తమైన అభినయ కళతో విరాజిల్లుతూ గ్రామాల్లో ఆనందాన్ని, అహ్లాదాన్ని పంచుతారు. పొద్దంతా కష్టించి వచ్చిన రైతులు, ఇతర కుల వృత్తిదారులు తమను ఆశ్రయించి వచ్చిన భిచ్చుక గాయకులను ఎంతో మర్యాదగా ఆదరిస్తారు. తమకు గల చరిత్ర, త్యాగం, వీరత్వం గాథలను గేయ రూపంలో వింటూ ఆనందిస్తారు, మురిసిపోతారు.
భిచ్చకులు ఊరంతా తిరిగి అందరిని దీవిస్తారు. పంటలు బాగా పండాలని, పశుసంపద చల్లగ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు దీవెనలు అందిస్తారు. వీరి కథల్లో మన చారిత్రక అంశాలే గాక, నాటి భాష, కళా సాంస్కృతిక సంపద మనకు తరతరాలుగా అందుతున్నది. నిజానికి వారిని మనం భిచ్చకులుగా గాక మన విలువైన చారిత్ర, కళా సాంస్కృతిక సంపదగా పరిగణించాలి. వారి కళారూపాలను, గేయ గాథలను సేకరించి భద్రపరచటం వల్ల భావితరాలకు అమూల్యమైన వారసత్వాన్ని ఇచ్చినవారమవుతాం. నిజానికి ఇదే మన చరిత్ర, కళా సాంస్కృతిక సంపదకు తరగని గని.
– డాక్టర్ సందినేని రవీందర్
94910 78515