అవధానం ఎట్లా పుట్టింది? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చెందింది? పూర్తిస్థాయి సాహిత్య ప్రక్రియగా ఎలా అవతరించింది? అష్ఠావధాన, శతావధానంగా ఎలా వికాసం చెందింది? అనే అంశాలను ప్రముఖ శతావధాని ఆముదాల మురళి విశ్లేషించారు. దర్శనం ఆధ్మాత్మిక మాసపత్రిక 19వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగ సారాంశమిది.
18వ శతాబ్దంలో అవధానం ఆరంభమైంది. అంతకుముందు కూడా అవధానం అనేటటువంటి పదం ఉంది. అవధానాలు ఉన్నాయి. అవధానం అనేది పూర్తిగా వేదానికి సంబంధించినటువంటిది. వేదాన్ని కంఠస్థం చేసే పాట పద్ధతుల్లో క్రమ, జంట, గణ మొదలైనవి ఉన్నాయి. ఆ విధంగా వేదాన్ని కంఠస్థం చేసే వాళ్లను అవధానులు అని వ్యవహరించే సంప్రదాయం మనకు ఉన్నది. అందుకే ఇప్పటికీ చాలామంది ఇంటిపేర్లు అవధానం అని ఉంటుంది లేదా పేరు తరువాత అవధాని అని ఉండేవాళ్లు వేదపండితుల్లో కనిపిస్తారు. అట్లాంటి అవధానం సాహిత్యంలోకి ప్రవేశించింది.
చెరిగొండ ధర్మన, రామరాజభూషణుడు, కోలాచల మల్లినాథ సూరి మొదలైనవాళ్లు అవధానాలు చేసినట్టు మనకు తెలుస్తున్నది. అయితే వాళ్ల అవధానాల తీరుతెన్నులు ఎలాంటివో, వాళ్లు ఏఏ అంశాలు స్వీకరించారనేది ఇదమిత్థంగా తెలియడం లేదు. భారతదేశంలో 18వ శతాబ్దం వరకూ అనేక స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. కాలక్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో మెల్లమెల్లగా అవి అంతర్భాగమైపోయాయి. కంపెనీ పాలనను ఎదిరించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. కొంతమంది జమీందార్లు ఎదిరించలేక వాళ్లకు కప్పం కడుతూ నామమాత్రపు అధికారంతో మిగిలిపోయారు. అయినా వాళ్ల దాస్య లక్షణం పోలేదు.
అదేవిధంగా భోగలాలసత పోలేదు. అధికార తృష్ణ పోలేదు. ఆ సందర్భంలో వాళ్లు ఎలాగైనా సరే తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి రకరకాలైన ప్రయత్నాలు చేశారు. కొంతమంది మహాకావ్యాలు రాయించి అంకితం తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. సంస్థానాధీశుల వద్ద 17, 18వ శతాబ్దాలలో ఉండే కవులందరూ చిత్ర కవిత్వంపై, బంధకవిత్వంపై, గర్భ కవిత్వంపై ఎక్కువగా దృష్టిని నిలపడంతో చెరకుగడలాంటి తెలుగు కావ్యం కాస్త వెదురుగడలాగా తయారైంది. ఆ వెదురు గడలను ఆస్వాదించే పరిస్థితి సాధ్యం కాక మెల్లగా కవిత్వం సామాన్యులకు కొంచెం దూరంగా జరిగింది.
జమీందార్ల వద్ద ఉండే పండితులు, ఆ పండిత సభల్లో చెప్పే కవిత్వం కేవలం కాలక్షేపానికి చెందిన అంశంగా మారిపోయింది. కాలక్షేపం అన్నప్పుడు, ఆసక్తిగా ఉంటే బాగుంటుందని మెల్లమెల్లగా సమస్యాపూరణం లాంటివి మొదలయ్యాయి సంస్థానాల్లో. జమీందారీ యుగంలో ఆశుకవిత్వం వల్ల, అవధానాల వల్ల, కవుల దేశాటనం వల్ల, తెలుగు కవిత్వంలో ఒక రకమైనటువంటి ఏకత మొదలైందని దీని గురించి ఆరుద్ర చెప్పారు.
ఆ ఏకత ఏమిటంటే, అవధానాలు, ఆశు కవిత్వాలు ప్రదర్శనకు యోగ్యంగా మారడం, అవి వేదికలెక్కడం, ఆ వేదికల మీద ఆశు కవితా ప్రదర్శనలు జరగడం, సభల్లో సమస్యలు ఇవ్వడం, వాటిని పూరణ చేయడం! ఇది ఒక కాలక్షేపంగా, పాండిత్య ప్రకర్షగా కూడా మారింది. ఒక జమీందారు చేసిన తర్వాత ఇంకో జమీందారు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ‘మా ఆస్థానంలో కూడా చేయండి’ అని అవధానాలు చేసే వాళ్లను పిలవడం ద్వారా ఒక రకంగా కవిత్వానికి, అవధానానికి, ఆశువునకు మంచి రోజులు వచ్చాయి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఆర్థిక కారణాల వల్ల మనిషిలో భావ పరివర్తన వస్తూ ఉంటుంది. డబ్బు గురించి డబ్బు లేని వాడు, సంపాదించని వాడు ఒక రకమైన భావం చెప్తాడు. డబ్బు ఉన్న వాడు.. డబ్బు గురించి చెప్పే మాట వేరుగా ఉంటుంది. ఆర్థిక కారణాల వల్ల మనిషిలో భావ పరివర్తన మొదలైన తర్వాత ఒకే ఆస్థానాన్ని అంటిపెట్టుకొని, ఆ రాజుకే సేవ చేస్తూ ఉండే రోజులు పోయాయి. నూటపదహార్లు ఇచ్చే రాజులు నలుగురు ఉన్నారంటే నలుగురి దగ్గర వార్షికం తీసుకునే పద్ధతులు మొదలయ్యాయి. అంటే ఆర్థిక కారణాలు, ఆర్థిక ఆలోచనలు మెల్లమెల్లగా కవుల ఆలోచనలను ప్రభావితం చేశాయి. ఆ కారణంతోనే నానారాజ సందర్శనం జరిగింది.
‘పృచ్ఛకులు బెత్తాయించిన విషయాల మీద అప్పటికప్పుడు, నిల్చున్న పళాన, కోరిన డిజైన్ల పద్యాలు చెప్పడం కొత్తరకం కవిత్వ వ్యాపారం’ అని ఆరుద్ర అన్నారు. కవిత్వ వ్యాపారం అంటే కవిత్వ కర్మ అని అర్థం. కొత్త రకమైన ప్రక్రియ ఏం వచ్చిందంటే ఆశు కవిత్వంలో కోరినట్లు చెప్పాలి, అప్పటికప్పుడు చెప్పాలి. అంటే ఇది వరకు లేని శ్రమ కవులకు కొత్తగా వచ్చింది. ఇదివరకు ప్రశాంతంగా కూర్చొని కావ్యం రాసుకొని మరుసటి రోజు సభలోకి వచ్చి, రాజు ప్రశాంతంగా ఉన్నప్పుడు నాలుగు తాళపత్రాలను అలా తిప్పి ఆ రోజు రాసిన పద్యాల్ని వినిపించి, పండితులతో చర్చ జరిపేవారు. కానీ, ఆశు దశలోకి వచ్చేటప్పటికీ పృచ్ఛకులు ఎప్పటికప్పుడు కోరినటువంటి పద్యాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇది అవధానానికి ఒక నాందిగా మారింది.
ఆరంభ దశలో సాహిత్యానికి సంబంధించినవి అవధానాల్లో ఏవేవి ఉన్నాయంటే, ఒకటి వ్యస్తాక్షరి, ఇంకొకటి అగ్రపద్యగ్రహణాభిరక్తి, మూడోది సమస్యాపూరణం. నిజానికి సమస్యాపూరణంతోనే అన్నీ మొదలయ్యాయి. అటు తర్వాత వ్యస్తాక్షరి వచ్చింది. తర్వాత కావ్య పఠనంలో అగ్ర పద్యం అంటే ముందు చదివినటువంటి పద్యం తర్వాత ఏ పద్యం వస్తుందో అవధాని చెప్పుకొంటూ వచ్చేవాడు. సహపాఠం కూడా వచ్చింది. తర్వాత సంఖ్యాలేఖనం, సంఖ్యాఖ్యానం, ఆ తర్వాత చతురంగం (చదరంగం ఆట) వంటి చమత్కార అంశాలు సాహిత్యేతరమైనవి కూడా మెల్లమెల్లగా అవధానంలోకి ప్రవేశించాయి.
1849లో పుదూరు సీతారామశాస్త్రి ఒక పెద్దబాల శిక్షను ప్రకటించారు. ఇది బహుశా మొట్టమొదటి పెద్దబాల శిక్ష. అందులో అవధానం గురించి ప్రస్తావించారు. చతురంగం, కవిత్వం, కవిత్వ లేఖనం, పఠనం, గణితం, సంగీతం, యుక్తి చెప్పడం, వ్యస్తాక్షరి అనే ఎనిమిదింటిని అష్టావధాన అంశాలుగా పేర్కొన్నారు. అటు తర్వాత అష్టావధాన అంశాలను స్పష్టంగా చెప్పిన వారు తిరుపతి వేంకట కవులు. 1892లో తిరుపతి వేంకట కవులు..
శా. పౌరాణోక్తి కవిత్వ పుష్ప గణనావ్యస్తాక్షరుల్ లౌక్య గం భీరోక్త్యంచిత కావ్య పాఠన కళావిద్భాషణంబుల్ ముదం
బారంగా చతురంగఖేలనము నీ యష్ట ప్రకారంబులొ ప్పారున్ శంకర! ఏక కాలముననే యష్టావధానమ్మునన్!
అంటే కావ్య పాఠం, కవిత్వం,శాస్ర్తార్థం, పురాణం, లౌకిక ప్రసంగం, వ్యస్తాక్షరి, చతురంగం, పుష్పగణనం అనే ఎనిమిది అంశాలను చెప్పారు. వీటిలో చతురంగం, పుష్పగణనం తప్ప మిగిలిన అన్నీ సాహిత్య సంబంధమైన అంశాలే. దేవులపల్లి సోదర కవులు అవధానంలో ఉద్దిష్టాక్షరి, నిర్దిష్టాక్షరి అనే రెండు కొత్త అంశాలను చేర్చారు. కాశీ కృష్ణాచార్యులు అశ్వఫ్లుతి, వారకథనం, ఆశుకథ అనే అంశాలను చేర్చారు. పిశుపాటి చిదంబర శాస్త్రి వివర్గాక్షరి, ఏకసంథాగ్రహణం అనే అంశాలను చేర్చారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సహపఠనం, లిఖితాక్షరి అనే అంశాలను చేర్చారు.
1908లో వేంకట రామకృష్ణ కవులు నిషిద్ధాక్షరి, వ్యాకరణ ప్రసంగం అనే అంశాల్ని చేర్చారు. 1913కు వచ్చేటప్పటికీ నందగిరి శేషగిరిరావు గణితాన్ని అవధాన అంశాల్లో చేర్చారు. వీరేశలింగం అవధానంలో పేకాటను కూడా చేర్చారు. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు అవధానంలో ఆంగ్ల ఉపన్యాసాన్ని, మనోగణితాన్ని చేర్చారు. ఇట్లా అనేక అంశాలు చేరుస్తున్నప్పటికీ పృచ్ఛకుల సంఖ్య మాత్రం ఎనిమిదే. దాదాపు ముప్పై ఐదు అంశాల్లో అవధానులు వారివారి మానసిక స్థితికి అనుగుణంగా, వారికి ఉన్నటువంటి సాధనకు అనుగుణంగా, వారి శక్త్యానుసారం ఎనిమిది అంశాలను స్వీకరించేవారు. సభానుగుణంగా గజల్ను పాడితే దాన్ని పద్యంలో చెప్పడం లేదా పద్యాన్ని పాట రూపంలోకి మార్చడం వంటివి తర్వాత కాలంలో అవధానాల్లో చేరాయి. ఆ తర్వాత మృదంగం, హార్మోనియం కూడా చేరాయి. పండితుల కోసం మిగిలిన అంశాలు ఉండగా, అవధానాలకు వచ్చే సాధారణ ప్రజల కోసం ఘంటా గణనం, పుష్పగణనం, ఆకాశ పురాణం, కథ చెప్పడం, మనోగణితం మొదలైన అంశాలను స్వీకరించారు. ఇవి సాహిత్యేతర అంశాలే అయినప్పటికీ పృచ్ఛకులు అవధాని మీద ఉండే ప్రేమతో వ్యంగ్య ప్రసంగాలు, చమత్కార ప్రసంగాలు చేసే సంప్రదాయం కూడా అప్పుడే మొదలైంది.
అవధాని ఆ సందర్భాన్ని అనుసరించి వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాలను ఉటంకిస్తూ సభారంజకం చేసేవారు. ఇప్పుడు అవధానాల్లో ప్రసంగాలు ఉండడం లేదు గానీ, పూర్వకాలంలో అవధానాల్లో అవధాని చేసే ప్రసంగం కూడా ఒక ప్రధానమైన అంశమే. ఆ ప్రసంగం కాస్త ఇప్పుడు అప్రస్తుత ప్రసంగంగా మారింది. పూర్వపు రోజుల్లో అది శాస్త్రచర్చగా ఉండేది. శాస్త్రచర్చ ప్రారంభమైతే రెండు గంటల్లో అవధానం పూర్తి కావాలని గానీ, గంటన్నరలో అవధానం పూర్తి కావాలని గానీ, మూడు గంటల్లో అవధానం పూర్తి కావాలని గానీ నియమాలు లేకుండా ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు చర్చ కొనసాగే రోజులవి. ఇవన్నీ కలగలుపుగా ఉన్నప్పుడు అవధానసభ శాస్త్ర విజ్ఞానం, వినోదం.. వంటి వాటి సమాహార రూపమైన ఒక అద్భుతమైన పండిత సభగా భాసిల్లేది తొలినాళ్లలో. అటు తర్వాత అవధానాల్లో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, అప్రస్తుత ప్రసంగం ఈ నాలుగు తప్పనిసరి అంశాలయ్యాయి. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది.. ధారణాంశాల్లో ప్రధానమైనటువంటివి.
1908లో వేంకట రామకృష్ణ కవులు నిషిద్ధాక్షరి, వ్యాకరణ ప్రసంగం అనే అంశాల్ని చేర్చారు. 1913కు వచ్చేటప్పటికీ నందగిరి శేషగిరిరావు గణితాన్ని అవధాన అంశాల్లో చేర్చారు. వీరేశలింగం అవధానంలో పేకాటను కూడా చేర్చారు. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు అవధానంలో ఆంగ్ల ఉపన్యాసాన్ని, మనోగణితాన్ని చేర్చారు. ఇట్లా అనేక అంశాలు చేరుస్తున్నప్పటికీ పృచ్ఛకుల సంఖ్య మాత్రం ఎనిమిదే.
ఇక ధారణేతర అంశాల్లో కొంతమంది ఆశువును వదిలి, పాటలో, పద్యాలో పెట్టుకోవడం ఉన్నప్పటికీ కచ్చితంగా అప్రస్తుత ప్రసంగం లేని అవధాన సభ జరగడం లేదు. అది నియతమైపోయింది. అంటే ఒకప్పుడు శాస్త్రచర్చగా ఉన్న విషయం తర్వాత కాలంలో అప్రస్తుత ప్రసంగంగా, హాస్య ప్రసంగంగా, వెకిలి ప్రసంగాలుగా, ద్వంద్వార్థాలతో కూడా ఉండే స్థాయికి దిగజారడం శోచనీయం. ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సిన నాలుగు అంశాలు కాకుండా వర్ణన, ఆశువు, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, ఘంటాగణనం, ఛందోభాషణం, వారగణితం, యాంత్రిక గణితం, పురాణపఠనం, నామసమీకరణం, శ్లోకానువాదం, పేరడీ, పాటకు పద్యం మొదలైన అంశాల్లో ఏవో ఒక నాలుగు స్వీకరించేవారు. అట్లా మొత్తానికి ఎనిమిది అంశాలతో అవధానం నడుస్తూ ఉండేది.
రాసుకోనటువంటి నియమం ఏమిటంటే కచ్చితంగా ఐదు ధారణాంశాలు అష్టావధానంలో ఉండితీరాలి. ఇది ఒక నియతిగా మొదటి నుంచి జరుగుతూ ఉన్న అంశం. అంతేగానీ, ధారణేతర అంశాలే ఆరు పెట్టుకొని రెండు మాత్రం ధారణాంశాలు పెట్టుకుంటామంటే కుదరదు. కచ్చితంగా ఐదు ధారణ అంశాలు ఉండాలి అనేది ఒక నియతిగా ఏర్పడింది. శతావధానాల్లో కూడా కచ్చితంగా మూడు ధారణాంశాలు, ఒక ధారణేతర అంశాన్ని ఎన్నుకొని 75 పద్యాలు అప్పజెప్పడం సంప్రదాయంగా మారింది. అలా కాకుండా ‘మేము ఆశువులే 50 చెప్తాం. ఆ మిగిలినటువంటివి 12:12 చెప్తాం’ అనడానికి వీల్లేదు. అవధానం వికాస దశకు వచ్చేటప్పటికీ ఒక స్పష్టత ఏర్పడింది. కచ్చితంగా ఈ అంశాలు ఉండాలి అని! ఆ స్పష్టత వల్ల తర్వాతి తరం అవధానులు హాయిగా అవధానాలు చేసుకుంటూ వెళ్లడానికి కావలసిన సిద్ధాన్నం సమకూరింది. మనం పద్యాన్ని నిలబెట్టుకోవడానికి, తద్వారా భాషను సంరక్షించుకోవడానికి ఒక ఆకరంగా అవధానం ఏర్పడింది. తద్వారా పద్యం తర్వాతి తరానికి కూడా అందుతుంది. భవిష్యత్తు తరాల వరకు భాష బతుకుతుంది.
శతావధాని ఆముదాల మురళి