Shashikala | ఆమె వంట చేస్తే.. నలభీములు సైతం వంక పెట్టలేరు. రుచిలో అణువంత కూడా తేడా కనిపించదు. కానీ ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చేదు రుచులు. వాటన్నిటినీ ఆత్మవిశ్వాసంతో అధిగమించారు రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన శశికళ. తనిప్పుడు పేరున్న పాకశాస్త్ర బోధకురాలు. ఆమె దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి దేశవిదేశాల నుంచి విద్యార్థులు వస్తారు. క్యాన్సర్తో భర్త మరణించే సమయానికి శశికళ ఒంటరి. నిరుపేద. ఇంగ్లిష్ ముక్క తెలియని అతిసామాన్యురాలు. ఇదంతా గతం.
ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె ఐదువేల మందికి భారతీయ వంటకాలు నేర్పించారు. అందులో ముప్పై దేశాలకు చెందినవారు ఉన్నారు. వాళ్లంతా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని మరీ ఉదయ్పూర్ వచ్చారు. మొదట్లో కుటుంబ పోషణ కోసం శశికళ విదేశీ అతిథుల బట్టలు ఉతికేవారు. ఓ ఐరిష్ జంట కోరిక మీద.. మనవైన వంటకాలు వండి వడ్డించారు. రుచి అద్భుతంగా అనిపించడంతో కుకరీ క్లాసులు ప్రారంభించమని సలహా ఇచ్చారు ఆ విదేశీయులు. అలా మొదలైంది ఆమె పాకశాస్త్ర ప్రయాణం. తొలిదశలో శశికళకు భాష
తీవ్ర అవరోధమైంది. ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడేస్తున్నారు. అంతర్జాతీయ యాత్రికుల దృష్టిలో ఉదయ్పూర్ అంటే.. అలనాటి కోటలే కాదు, శశికళ పాకశాస్త్ర పాఠాలు కూడా.